PM Modi In Prayagraj: మహాకుంభమేళాలో మోదీ..బీష్మ అష్టమి రోజున పుణ్యస్నానం చేసిన ప్రధాని

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారు. కుంభమేళాలో త్రివేణి సంగంలో పుణ్య స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. ఇతర మతాలకు చెందిన అనేకమంది కూడా కుంభమేళాకు హాజరవుతుండటం విశేషం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ప్రయాగరాజ్ వెళ్లి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఇవాళ బీష్మ అష్టమి సందర్భంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మోదీ పుణ్య స్నానం చేశారు. చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు.

mahakumbh mela 2025 pm modi takes a holy dip at tiveni sangam in prayagraj

అంతకుముందు అలైల్ ఘాట్ నుంచి సంగమం వరకు బోట్ లో ప్రయాణించారు మోదీ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ వెంట ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగం ఘాట్‌కు చేరుకున్న వెంటనే మోదీ మోదీ అంటూ నినాదాలు మార్మోగాయి.

బీష్మ అష్టమి రోజునే మోదీ పుణ్న స్నానం ఎందుకు
మహా భారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘ మాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు భీష్మాష్టమి. ఈ రోజున పుణ్య నది స్నానం చేయడం, పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి. ఈ రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమవగా..మహాశివరాత్రి వరకు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 38 కోట్ల మందికి 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లెక్కకు మించి వచ్చే కోట్లాది మంది భక్త జనానికి యూపీ సర్కార్ ఆహారం, నీరుతో పాటు అవసరమైన వసతులన్నీ ఉచితంగా కల్పిస్తోంది. మహా కుంభమేళాలో పవిత్ర నదీ స్నానాలే కాదు.. సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Desktop Bottom Promotion