Mukesh Ambani-Manoj Modi: రైట్‌హ్యాండ్ లాంటి ఉద్యోగికి రూ.1500 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన అంబానీ

ముఖేష్ అంబానీ అంటే అపర కుబేరుడు. ఆసియాలోనే దిగ్గజ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఆయన ఏదైనా రంగంలోకి అడుగు పెట్టారంటే ప్రత్యర్థులు వణికిపోతుంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. తాజాగా ఆయన తన ఫ్రెండ్ కు ఇచ్చిన గిఫ్ట్ గురించి కూడా చర్చ మొదలైంది. మరి అలాంటిలాంటి గిఫ్ట్ ఇచ్చాడనుకుంటున్నారా.

ఏ ఖరీదైన వాచో, లగ్జరీ కారో, ఇంకేదైనా గిఫ్ట్ ఇస్తే పెద్ద వార్త కాకపోయేది. కానీ అక్కడ ఉన్నది అంబానీ, తను ఏది చేసినా దాని గురించే అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది. తన కుడిభుజం లాంటి వ్యక్తికి, స్నేహితుడికి కళ్లు చెదిరే గిఫ్ట్ ను ఇచ్చారు ముఖేష్ అంబానీ. ఆ గిఫ్ట్ విలువ ఏకంగా రూ. 1500 కోట్లు.

Mukesh Ambani Gift Rs 1500 Crore Property To His Righthand And Friend Manoj Modi

కుడిభుజం లాంటి వ్యక్తి ఆయన:
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ ఏకంగా రూ. 1500 కోట్ల గిఫ్ట్ ఇచ్చారు. 22 అంతస్తుల భవంతిని బహుమతిగా ఇచ్చినట్లు నేషనల్ మీడియా కోడై కూస్తోంది. మనోజ్ మోదీ చాలా కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పని చేస్తున్నారు.

రిలయన్స్ ఇతర కంపెనీలతో చేసుకున్న వందల కోట్ల డీల్స్ లో మనోజ్ మోదీదే కీలక పాత్ర. అందరూ మనోజ్ మోదీని ముఖేష్ అంబానీకి రైట్ హ్యాండ్‌గా వ్యవహరిస్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఇదే కంపెనీలో ఉంటూ పనిచేస్తున్నారు. ఇన్నేళ్ల విధేయతకు ముఖేష్ అంబానీ ఇచ్చిన గిఫ్ట్ ఇది అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి.

కేవలం పార్కింగ్‌కే 7 అంతస్తులు:
మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ కానుకగా ఇచ్చిన 22 అంతస్తుల బిల్డింగ్ ముంబయిలోని నేపియన్ సీ రోడ్డు ప్రాంతంలో ఉంది. ఈ భవంతికి 'బృందావన్' అనే పేరు పెట్టారు. 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఇందులో ఒక్కో అంతస్తు 8వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉంటుంది.

పార్కింగ్ కోసమే 7 అంతస్తులను కేటాయించారు. ఇందులో కొన్ని అఁదస్తుల్లో మనోజ్ మోదీ కుటుంబంతో కలిసి నివసించనుండగా.. మరికొన్నింటిలో ఆయన ఇద్దరు కుమార్తెలు తమ అత్తింటి కుటుంబాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ భవంతిలోని ఫర్నిచర్ ను ఇటలీ నుండి తెప్పించారు.

నేపియన్ సీ రోడ్డులోని ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.45 వేల నుండి రూ. 70 వేల వరకు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ భవంతి ధర సుమారు రూ. 1500 కోట్లు ఉంటుందని అంచనా.

చిన్నప్పటి నుండి మిత్రులు:
మనోజ్ మోదీ ముఖేష్ అంబానీ చిన్ననాటి మిత్రులు. ముంబయిలోని యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడే 1980ల్లో మనోజ్ మోదీ సంస్థలో ఉద్యోగిగా చేరారు.

Story first published: Wednesday, April 26, 2023, 16:23 [IST]
Desktop Bottom Promotion