భక్తులకు అలర్ట్‌.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.?

ఒడిశాలో పూరీ జగన్నాథుని రథయాత్ర నేడు లక్షలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీకృష్ణ, బలభద్ర, సుభద్రల రథాల ఊరేగింపును తిలకించేందుకు, రథాలను లాగేందుకు భక్తులు ఉత్సాహం ప్రదర్శించారు. కానీ ఆ కాసపటికే చోటుచేసుకున్న అపశ్రుతి తీవ్ర కలకలం రేపింది. భక్తుల రద్దీతో తొక్కిసలాట ఏర్పడి ఒకరు మృతి చెందగా.. దాదాపు 120 మందికి పైగా గాయపడ్డారు.

odisha puri jagannath rath yatra stampede causes and complete safe guide to pilgrims

ఇలా జరగడం మొదటిసారి కాదు..

ఇదిలా ఉండగా.. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రైల్వే స్టేషన్లు, ఆలయాలు, క్యూలైన్లు, బహిరంగ సమావేశాలు, ర్యాలీలు ఇలా ప్రదేశం ఏదైనా రద్దీ ఉంది అంటే దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా బయలుదేరిన వారు విషన్న వదనాలతో ఎందుకు తిరుగు పయనమవుతున్నారు. అయినవారిని ఎందుకు కోల్పోతున్నారు. లోపం ఎక్కడుంది.? ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఏం చేయాలి.? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి.?

కారణాలేంటి.?

సాధారణంగా ప్రధాన ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, ఊరేగింపుల సమయంలో ఆలయ ప్రాంగణానికి పరిమితికి మించిన భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయాలు దాదాపుగా చాలా పురాతనమైనవి కారణంగా లోపలికి, బయటకి రాకపోకలు సాగించేందుకు మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు గుమిగూడితే వారిని అదుపు చేయడం కష్టంగా మారుతుంది. ఇంకా క్యూలైన్లలో ఇనుప, చెక్క రైలింగ్స్‌ భక్తుల ఒత్తిడికి విరిగిపోయి, ఊడిపోవడం కారణఁగా జనం ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాటకి దారితీస్తుంది.

ఇక, ప్రత్యేక పర్వదినాలు, రథయాత్రల ఊరేగింపు సమయంలో రథాలను తాకేందుకు, లాగేందుకు ఉత్సాహంగా వేలాది మంది భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో గందరగోళం ఏర్పడుతుంది. ఈ రద్దీని నియంత్రించేందుకు సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడం, వాలంటీర్లు లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణం.

odisha puri jagannath rath yatra stampede causes and complete safe guide to pilgrims

ఇక, ఊరేగింపు సమయాల్లో భక్తుల రద్దీ ఉన్నప్పుడు ఏవైనా వదంతులు వ్యాపించినా ఒక్కసారిగా జనం ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయడంతో తొక్కిసలాట తలెత్తుతుంది. కరెంటు తీగల ద్వారా షాక్‌ కొట్టే పరిస్థితులు ఏర్పడినా, పటాకులు పేలినా.. ఒక్కసారిగా వారిలో ఆందోళన నెలకొని ఒకరికి ఒకరు నెట్టుకుని పోయేలా చేస్తుంది. సామర్థ్యానికి మించిన భక్తులు చేరుకున్నప్పుడు నియంత్రణ లోపం ఏర్పడితే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.

రద్దీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

మీరు బ్రహ్మోత్సవాలు, భగవంతుడి రథయాత్ర, ఆలయాల్లో ఊరేగింపు, కుంభమేళా, పుష్కరాలు వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను వెళ్తున్నప్పుడు కుటుంబంతో కలిసి వెళ్లినా, ఫ్రెండ్స్‌ కలిసి వెళ్లినా కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వెళ్లే ఆలయానికి సంబంధించి దర్శనం, వసతి టికెట్లను ఆన్‌లైన్‌లోనే రిజర్వ్ చేసుకోవడం ఉత్తమం. రద్దీ ఎక్కువగా ఉన్పప్పుడు నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ ఉండవు. అలాంటప్పుడు ముందుగా మ్యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఆధార్‌ లాంటి గుర్తింపు కార్డులను పర్సులో ఉంచుకోండి.

odisha puri jagannath rath yatra stampede causes and complete safe guide to pilgrims

భద్రత

క్యూ లైన్లలో రద్దీ ఎక్కువగా ఉండి తోపులాట జరుగుతున్నప్పుడు వెనుక నుంచి మిమ్మల్ని తోసేవారిని నివారిస్తూ ఓపికగా ఉండాలి. ముందుగానే బయటకు వెళ్లే దారులను గమనించాలి. పిల్లలు, వృద్ధులతో వెళ్తున్నప్పుడు వారి చేతికి మీ ఫోన్‌ నెంబర్‌ స్కిక్కర్‌ను అంటించడం ద్వారా తప్పిపోవడం లాంటివి జరిగితే వారిని గుర్తించడం సులభమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లకండి. పర్సులు, ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మంచినీళ్ల బాటిల్‌, అవసరమైన మందులు వెంట తీసుకెళ్లాలి.

  • అత్యవసర మార్గాల గుర్తింపు

మీరు ఆధ్యాత్మిక ఉత్సవ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే ఎమర్జెన్సీ మార్గాలను చూసుకోవాలి. అదే విధంగా ప్రథమ చికిత్స కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి.

  • కుటుంబంతో కలిసి ఉండండి

మీరు చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి వెళ్తున్నప్పుడు వారిని ఒంటరిగా వదిలేయకండి. గుంపుగా కలిసి వెళ్తూ రద్దీలో జాగ్రత్తగా వెళ్లడం మంచిది.

  • గుర్తింపు కార్డులు

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు, వృద్ధులు తప్పిపోయే అవకాశం ఎక్కువ. అందుకే వారి మెడలో వారి పేరు, ఫోన్‌ నెంబర్‌, అడ్రస్‌ కనిపించేలా ట్యాగ్స్‌, గుర్తింపు కార్డులు ఉంచాలి.

  • సౌకర్యవంతమైన దుస్తులు

మీరు ఉత్సవాల్లో ఉన్నప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. గట్టిగా ఉండే బూట్లు, చెప్పులు ధరించడం ఉత్తమం. వదులైన దుస్తులు, జారిపోయే చెప్పులు వేసుకోవడం ద్వారా ప్రమాదం కలగవచ్చు.

  • తొక్కిసలాటలో

భక్తుల రద్దీలో తొక్కిసలాట లేదంటే తోపులాట జరిగినప్పుడు మీరు కీలక జాగ్తత్తలు తీసుకోవాలి. మీ చేతులను ఛాతీ ముందు బాక్సర్ లాగా అడ్డుపెట్టుకోవాలి. మీరు గుంపుతో పాటు ముందుకు వెళ్లడం. వెనక్కి వెళ్లినట్లయితే వారు మీ పైన పడే ప్రమాదం ఉంది.

  • కింద పడిపోతే

పొరపాటున మీరు గుంపులో పడిపోతే వీలైనంత త్వరగా పైకి లేవడానికి ట్రై చేయండి. సాధ్యం కాకపోతే తల, ఛాతీని చేతులతో కప్పుకొని ముడుచుకొని ఉండండి. దీని ద్వారా శరీరంలో ప్రధాన భాగాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

  • విలువైన వస్తువులు

రద్దీలో ఉన్నప్పుడు బంగారు నగలు, విలువైన వస్తువులు, ఎక్కువ డబ్బును వద్ద ఉంచుకోవండి. సెల్‌ ఫోన్‌, పర్సును జాగ్రత్తగా జేబులో ఉండేలా చూసుకోండి.

  • నీరు, భోజనం

రద్దీలో ఉన్నప్పుడు మీ వెంట నీళ్ల బాటిల్‌ తప్పనిసరి. డీహడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. గుంపులో త్వరగా చెమట పడుతుంది. వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. అలాంటప్పుడు చల్లని ప్రదేశాలకు వెళ్లడం మంచిది.

  • పోలీసుల ఆదేశాలు

మీరు గుంపులో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం, అపశ్రుతి వంటివి చోటుచేసుకున్నప్పుడు ఆందోళనతో పరుగెత్తకండి. ప్రశాంతంగా ఉండటం మంచిది. భద్రతా సిబ్బంది, వాలంటీర్లు, పోలీసుల ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్త తీసుకోండి. భద్రతా మార్గదర్శకాలను పాటించడం మర్చిపోకండి.

Story first published: Thursday, July 16, 2026, 20:27 [IST]
Desktop Bottom Promotion