ఘుమఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ ఎందుకు అంతగా ఫేమస్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది

బిర్యానీ అనగానే మొదట గుర్తుకువచ్చేది హైదరాబాద్. అంతగా ఫేమస్ అయింది హైదరాబాదీ చికెన్ బిర్యానీ. ఏ రెస్టారెంట్ కు వెళ్లిన ఆర్డర్ చేసేది మాత్రం బిర్యానీయే. ఈ ధోరణి కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు మాత్రమే పరిమితం కాదు. నార్తిండియాలోనూ చాలా మంది బిర్యానీని ఇష్టంగా తింటుంటారు. ప్రత్యేక సందర్భాల్లో, వేడుకలో వేళ, న్యూ ఇయర్ వేళ బిర్యానీని టాప్ ఆర్డర్ చేస్తున్నట్లు స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. బిర్యానీ అంటే మంచి మసాలాల ఘాటు సువాసన, బాస్మతీ రైస్ అరోమా, మంచి ఘాటైన రుచి ఉండాలి. అలాంటి ఓ మాంచి బిర్యానీ తింటుంటే అద్భుతంగా ఉంటుంది.

Origin And History Of Hyderabadi Chicken Biryani In Telugu

హైదరాబాదీ చికెన్ బిర్యానీ చరిత్ర:

ఈ పరాయి దేశ వంటకాన్ని మనం చాలా ఓన్ చేసేసుకున్నాం. నైజాం పాలన సమయంలో ఇరాన్ దేశం నుంచి హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టింది బిర్యానీ. ఆ సమయంలో బిర్యానీలో అప్పటి వంటకారులు మన రుచులకు తగ్గట్లు చాలా మార్పులు చేశారు. అలా చేస్తూ చేస్తూ ఇప్పటి బిర్యానీని తీసుకువచ్చారు. ఈ వంటకం పరాయి దేశం నుంచి వచ్చినప్పటికీ.. దీని రుచి, అరోమా, ఘాటుదనం మన దేశ ప్రజలకు తెగ నచ్చేసింది.

హైదరాబాదీ అంటే చార్మినార్ ఎంతగా గుర్తుకు వస్తుందో.. బిర్యానీ కూడా అదే స్థాయిలో గుర్తుకు వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా హైదరాబాదీ దమ్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివిధ రాష్ట్రాల్లోనూ హైదరాబాదీ దమ్ బిర్యానీ అనే పేరుతోనే బిర్యానీని తయారు చేస్తుంటారు.


బిర్యానీ ఎలా పుట్టింది:

బిరింజ్ బిరియాన్ అనే పర్షియన్ పదం నుంచి బిర్యానీ అనే పదం పుట్టుకొచ్చిందని అంటారు. బిరింజ్ బిరియాన్ అంటే ఇరాన్ లో ఫ్రైడ్ రైస్ అని అర్థం. ఈ ఫ్రైడ్ రైస్ కు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ బిరింజ్ బిరియాన్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు దానికి చాలా మార్పులు చేశారు. భారత్ అంటేనే సుగంధద్రవ్యాలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజలు కొద్దిగా ఘాటుగా ఉన్న వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. బిరింజ్ బిరియాన్ కు కూడా సుగంధ ద్రవ్యాలు జోడించారు. అలాగే చికెన్, మటన్ లాంటి మాంసాలతో ప్రత్యేకంగా తయారు చేయడం ప్రారంభించారు. మొదట్లో కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపై చాలా సేపు ఉండికించినప్పుడు ఆ మాంసం నుంచి వచ్చే రసాలు అన్నంలోకి ఊరుతాయి. దానికి సుగంధ ద్రవ్యాలు చేర్చి బిర్యానీగా తయారు చేయడం మొదలు పెట్టారు.

గతంలో ఇరాన్ నించి బిరింజ్ బిరాయన్ వంటకం ఇప్పుడు ఇరాన్ లో దాదాపు కనుమరుగు అయిపోయింది. అన్నంతో బిర్యానీ వండటం ఇప్పుడు వారికి కొత్తగా ఉంటుంది. బిరింజ్ బిరియాన్ స్థానంలో ఇరాన్ లో ఇప్పుడు మాంసాన్ని సన్నగా తరిగి, మంటపై కాల్చి, రోటీలో పెట్టి తయారు చేసే షవార్మా తరహా వంటకాలను ఇరాన్ ఎక్కువగా తింటుంటారు.


నవాబుల నుంచి సాధారణ ప్రజలకు చేరువైన బిర్యానీ:

మొదట్లో బిర్యానీ కేవలం నవాబులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఖరీదైన వ్యవహారం, చాలా సమయంలో కూడుకున్న వంటకం కావడంతో అప్పట్లో ధనవంతులు మాత్రమే ఎక్కువగా తింటుండే వారు. కాలక్రమేణా బిర్యానీ తయారీలో వచ్చిన మార్పులు బిర్యానీని సాధారణ ప్రజలకు కూడా దగ్గర చేసింది. చెఫ్ లను బట్టి బిర్యానీ తయారు చేసే విధానం కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే బిర్యానీ తయారీ విధానం చిన్న చిన్న తేడాలతో దాదాపు ఒకేలా ఉంటుంది.


ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన బిర్యానీ:

ఇరాన్ నుంచి వచ్చిన బిర్యానీని హైదరాబాద్ ఓన్ చేసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లభించే బిర్యానీలో ప్రాంతాలను బట్టి రుచి, తయారీ విధానంలో కూడా మార్పులు ఉంటాయి. కేరళలో మలబార్ బిర్యానీ, బెంగాల్ లో ధాకాయ్ బిర్యానీ, భోపాల్ లోని అఫ్ఘానీ బిర్యానీ, ఉత్తరప్రదేశ్ లో మురాదాబాదీ బిర్యానీ, రాజస్థాన్ లో అజ్మీరీ బిర్యానీ లాంటివి ఫేమస్.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Thursday, July 13, 2023, 17:57 [IST]
Desktop Bottom Promotion