శ్రావణ మాసం 2025 ముఖ్య తేదీలు,ప్రాముఖ్యత,దక్షిణ భారత ఆచారాలు,రహస్యాలు ఇవే!

హిందూ క్యాలెండర్‌ లో అత్యంత పవిత్రమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి. భారతదేశమంతటా శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ దక్షిణ భారత రాష్ట్రాలైన ఏపీ,తెలంగాణ,కర్ణాటక,కేరళలో దీనిని జరుపుకునే విధానం చాలా ప్రత్యేకం. ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలు విలక్షణంగా ఉంటాయి. 2025లో దక్షిణ భారతదేశంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, దాని ప్రాముఖ్యత, ప్రత్యేక పూజలు, ప్రాంతీయ వైవిధ్యాలు, చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూడండి.

2025లో దక్షిణ భారతదేశంలో శ్రావణ మాసం ఎప్పుడు?
నార్త్ ఇండియాలో పౌర్ణమితో నెల ముగిసే పూర్ణిమాంత క్యాలెండర్‌ను పాటిస్తుంటారు..సౌత్ ఇండియాలో అమావాస్యతో నెల ముగిసే అమావాస్యంత క్యాలెండర్‌ ను అనుసరిస్తుంటారు. అందుకే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన శ్రావణ మాసం 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది.

ప్రారంభ తేదీ: జూలై 28, 2025 (సోమవారం)
ముగింపు తేదీ: ఆగష్టు 26, 2025 (మంగళవారం)

Shravana Masam 2025 start Dates Rituals and Significance in Andhra and Telangana

పరమ శివుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైనవిగా భావించే ముఖ్యమైన సోమవారాలు (శ్రావణ సోమవారాలు)
జూలై 28
ఆగష్టు 4
ఆగష్టు 11
ఆగష్టు 18
ఆగష్టు 25

దక్షిణాదిలో శ్రావణ మాస ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
శ్రావణ మాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసమైనప్పటికీ దక్షిణాదిలో ఈ మాసం స్థానిక దేవతలు, ప్రాంతీయ నమ్మకాలు, బలమైన శైవ సంప్రదాయాలతో పెనవేసుకుని ఉంటుంది. ఈ నెలలో చేసే ఎలాంటి ఆధ్యాత్మిక సాధనకైనా ముఖ్యంగా వ్రతాలు, ధ్యానం, శివపూజలకు ఫలితం రెట్టింపు అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ మాసంలో దక్షిణాదిలో కనిపించే ప్రధాన ఆధ్యాత్మిక భావనలు
ఉపవాసాలు, ఆలయ దర్శనాలతో ఆత్మశుద్ధి చేసుకోవడం. బ్రాహ్మణులు, పూజారుల కుటుంబాల్లో మౌనం, ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వడం. పవిత్ర నదులలో స్నానాలు, శివలింగాలకు అభిషేకాలు చేయడం. భజనలు, కీర్తనలు, శివ పురాణ పఠనంతో భక్తిని పెంపొందించుకోవడం.

సాధారణంగా పాటించే పూజలు, సంప్రదాయాలు
దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో శ్రావణ మాసాన్ని ఎలా జరుపుకుంటారో చూద్దాం.

-శివాభిషేకం, సోమవార వ్రతం
-భక్తులు ప్రతి సోమవారం శివాలయాలకు పాదయాత్రగా వెళ్లి పాలు, నీరు, తేనె, పెరుగు, మారేడు పత్రాలతో అభిషేకాలు చేస్తారు.

-చిదంబరం, రామేశ్వరం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు, మహాదేవ యజ్ఞాలు నిర్వహిస్తారు.

-మహిళలు తమ భర్తల శ్రేయస్సు కోసం లేదా మంచి భర్త లభించాలని కోరుతూ సోమవార వ్రతాలు ఆచరిస్తారు.

సాత్విక ఆహారం, ఉపవాసం
ఈ మాసం మొత్తం చాలామంది మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యపానానికి దూరంగా ఉంటారు. సోమవారాల్లో పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ప్రసాదం లేదా సగ్గుబియ్యం చేసిన వంటకాలతో భోజనం చేస్తారు.

రుద్రాభిషేకం, లఘు రుద్ర పఠనం
ఆలయాలలో రుద్రాభిషేకం, రుద్ర పారాయణం, ఏకాదశ రుద్ర హోమాలు సాధారణంగా జరుగుతాయి. భక్తులు ఆధ్యాత్మిక ఉన్నతి, రక్షణ కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని, రుద్రం-చమకం వంటి స్తోత్రాలను పఠిస్తారు.

కావడి యాత్ర
ఉత్తరాదిలో జరిగేంత వైభవంగా కాకపోయినా ఏపీ, కర్ణాటకలలో భక్తులు స్థానిక నదులకు పాదయాత్రగా వెళ్లి అక్కడ నుండి నీటిని తీసుకువచ్చి శివాలయాల్లో సమర్పించడం ద్వారా కావడి సంప్రదాయాన్ని పాటిస్తారు.

నంది పూజ
కర్ణాటక, తమిళనాడులలో శ్రావణ మాసంలో నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. నందిని.. సహనానికి, భక్తికి, శక్తికి ప్రతీకగా కొలుస్తారు.

వరలక్ష్మీ వ్రతం
ఇది శ్రావణ మాసంలో భాగమైనా, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే అతిపెద్ద లక్ష్మీదేవి పూజ. సంపద, శ్రేయస్సు, కుటుంబ సౌభాగ్యం కోసం ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

Shravana Masam 2025 start Dates Rituals and Significance in Andhra and Telangana

దక్షిణాదిలోని ప్రముఖ ఆలయాలలో శ్రావణ మాస వేడుకలు
కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (కర్ణాటక): శ్రావణ మాసంలో భక్తులు ఇక్కడ సర్పదోష పరిహార పూజలు నిర్వహిస్తారు.
చిదంబరం ఆలయం (తమిళనాడు): నటరాజ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతాయి.
శ్రీకాళహస్తి ఆలయం (ఆంధ్రప్రదేశ్): రాహు-కేతు పూజల ప్రాముఖ్యత శ్రావణ మాసంలో మరింత పెరుగుతుంది.
శ్రీశైలం (తెలంగాణ): ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో శ్రావణ సోమవారాల్లో భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతపుర సరస్సు ఆలయం (కేరళ): ముఖ్యంగా సోమవారాల్లో ఉపవాసాలు, ప్రత్యేక పూజలు చేస్తారు.

మీకు తెలియని నిజాలు
దక్షిణ భారతదేశంలో సోమవారాన్ని చంద్రుడితో (సోముడు) ముడిపెడతారు. చంద్రుడు శ్రావణ మాసంలోనే శివుని అనుగ్రహంతో శాపవిముక్తి పొందాడని నమ్మకం. ఈ నెలలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో రామేశ్వరంలోని జ్యోతిర్లింగం ఒకటి.
శ్రావణ మాసాన్ని "ఆధ్యాత్మికంగా శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకునే మాసం"గా పరిగణిస్తారు.
కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రత్యేకం. మహిళలు ఐశ్వర్యం కోసం ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు.
శివునికి సమర్పించే బిల్వపత్రాలలో త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల) శక్తి నిక్షిప్తమై ఉంటుందని విశ్వసిస్తారు.

శ్రావణ మాసం ఎందుకంత శక్తివంతమైనది?
పురాణాల ప్రకారం శ్రావణ మాసంలోనే సముద్ర మథనం జరిగింది. ఆ సమయంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని శివుడు సేవించి లోకాలను రక్షించాడు. అంతేకాకుండా ఈ మాసంలో గ్రహాలు, నక్షత్రాల స్థితిగతులు భక్తికి, ఆధ్యాత్మిక పరివర్తనకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో చేసే జపం, ఉపవాసం మన కర్మలను దహించి, అంతర్గత స్వస్థతను చేకూరుస్తాయని చెబుతారు.

Story first published: Wednesday, July 9, 2025, 17:24 [IST]
Desktop Bottom Promotion