తెలంగాణ టూరిజం బంపరాఫర్..తక్కువ ధరకే యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, పోచంపల్లి టూర్

ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో ఒక్క రోజైనా ప్రశాంతంగా గడపాలని ఉందా? దైవ దర్శనంతో పాటు మన సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని కుటుంబ సమేతంగా కనులారా వీక్షించాలని కోరుకుంటున్నారా? అయితే మీ కోసమే తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది.

TGTDC One Day Tour Visit Yadagirigutta Pochampally Swarnagiri Check Price Itinerary Here

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కళాత్మక పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వన్ డే పిల్‌గ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్(One Day Pilgrimage and Heritage Tour) పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా అత్యంత సౌకర్యవంతంగా, సరసమైన ధరలో తెలంగాణ ఆధ్యాత్మిక, చేనేత వారసత్వాన్ని ఒకే రోజులో చుట్టిరావచ్చు.

రూట్ మ్యాప్ సాగేదిలా..
ఈ ప్రత్యేక యాత్ర హైదరాబాద్ - యాదగిరిగుట్ట - శిల్పారామం - కొలనుపాక జైన మందిరం - స్వర్ణగిరి దేవాలయం - పోచంపల్లి - హైదరాబాద్ మార్గంలో సాగుతుంది. దైవభక్తిని, హస్తకళలను, ప్రాచీన చరిత్రను ఒకే దారిన అనుసంధానం చేస్తూ పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చేలా ఈ టూర్‌ ను డిజైన్ చేశారు.

యాత్ర షెడ్యూల్ విశేషాలు
ఈ ప్రయాణం ప్రతిరోజూ ఉదయం హైదరాబాద్‌ లో ప్రారంభమవుతుంది. పర్యాటకుల సౌకర్యార్థం ఉదయం 7:00 గంటలకు సికింద్రాబాద్ యాత్రి నివాస్ దగ్గర, 7:15 గంటలకు బేగంపేట పర్యాటక్ భవన్ దగ్గర, 7:30 గంటలకు బషీర్‌బాగ్ సీఆర్వో ఆఫీస్ దగ్గర బోర్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

బస్సు ఎక్కిన తర్వాత పర్యాటకులను నేరుగా తెలంగాణ అభినవ తిరుపతిగా పేరొందిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి తీసుకెళ్తారు. స్వామివారి దివ్య దర్శనం అనంతరం అక్కడే ఉన్న హరిత హోటల్‌ లో బ్రేక్ ‌ఫాస్ట్ వడ్డిస్తారు. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ వాతావరణం, హస్తకళలకు అద్దం పట్టే యాదగిరిగుట్ట శిల్పారామాన్ని సందర్శిస్తారు.

అక్కడినుంచి ప్రయాణం పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యమైన కొలనుపాక జైన దేవాలయానికి చేరుకుంటుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ మందిర శిల్పకళ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆ తర్వాత భువనగిరిలోని వివేరా హోటల్‌ లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు.

భోజనం తర్వాత, ఇటీవల కాలంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న, అద్భుతమైన కట్టడంగా పేరు తెచ్చుకున్న స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి పయనమవుతారు. ఆ ఆధ్యాత్మిక శోభను చూశాక.. చేనేత కళలకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఇక్కత్ వస్త్రాల పురిటిల్లు భూదాన్ పోచంపల్లికి చేరుకుంటారు. అద్భుతమైన వస్త్రాల తయారీని, నేత కార్మికుల నైపుణ్యాన్ని కనులారా చూసి తరించాక.. పోచంపల్లి హరిత హోటల్‌ లో సాయంత్రం వేడివేడి టీ, స్నాక్స్ ఆస్వాదిస్తారు. ఈ మధుర స్మృతులతో రాత్రి 7:30 గంటలకల్లా బస్సు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో ఈ విహారయాత్ర సుఖాంతం అవుతుంది.

ప్యాకేజీ ధర
పర్యాటకుల ప్రయాణం మొత్తం ఏసీ మినీ బస్సులో సాగుతుంది. ప్రయాణ ఛార్జీలతో పాటు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, ఆయా దేవాలయాల్లో ప్రత్యేక దర్శన ఏర్పాట్లన్నీ ఈ ప్యాకేజీ ధరలోనే కలిసి ఉంటాయి. పెద్దలకు రూ. 2,070..పిల్లలకు: రూ. 1,770 ఉంటుంది.

Story first published: Thursday, July 2, 2026, 21:33 [IST]
Desktop Bottom Promotion