కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఏ ట్రైన్ ని పిలుస్తారో తెలుసా?

మనదేశంలో ప్రతి రోజూ లక్షల మంది రైళ్లల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ఒకరకంగా భారత ఆర్థిక వ్యవస్థకు భారతీయ రైల్వే ఒక వెన్నెముక లాంటిది. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌ వర్క్‌ లలో ఒకటిగా, ప్రతిరోజూ దాదాపు 22,593 రైళ్లను నడుపుతూ, కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది ఇండియన్ రైల్వేస్.

13,452 ప్యాసింజర్ రైళ్లు నిత్యం మన దేశంలో పట్టాలపై పరుగులు పెడుతుంటాయి. అయితే ఈ వేలాది రైళ్లలో ఒక రైలు మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, హోదాను సంపాదించుకుంది. అదే కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్(భారతీయ రైల్వేల రారాజు)గా పిలవబడే రాజధాని ఎక్స్‌ప్రెస్.

The King of Indian Railways Why Rajdhani Express Rules the Tracks

రారాజు అని ఎందుకు పిలుస్తారు?
దేశంలోని వేలాది రైళ్లలో రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ కు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. రాజధాని అంటే దేశానికి రాజధాని నగరం అని అర్థం. న్యూఢిల్లీ అనే దేశ రాజధానిని, దేశంలోని ఇతర రాష్ట్రాల రాజధానులతో అనుసంధానించే ఉద్దేశంతో ఈ రైలు పుట్టింది.

కేవలం అనుసంధానమే కాదు, ఇది అందించే వేగం, విలాసవంతమైన సౌకర్యాలు, కచ్చితమైన సమయపాలన దీనిని మిగతా రైళ్ల కంటే అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి.

భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైలుగా రాజధాని ఎక్స్ ప్రెస్ చరిత్ర సృష్టించింది. దీని రాకతో భారతీయ రైల్వేల ముఖచిత్రమే మారిపోయింది.

చరిత్రలో ఒక మైలురాయి
రాజధాని ఎక్స్‌ప్రెస్ తన ప్రస్థానాన్ని 1969, మార్చి 3న ప్రారంభించింది. న్యూఢిల్లీ నుండి హౌరా (కోల్‌ కతా) మధ్య మొదటిసారిగా దీనిని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఈ రెండు మహానగరాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 17 గంటలకు తగ్గించి సంచలనం సృష్టించింది.

ఆ విజయం అందించిన స్ఫూర్తితో ముంబై, చెన్నై, బెంగళూరు, గౌహతి వంటి ప్రధాన నగరాలకు దీనిని విస్తరించారు. నేడు, దేశవ్యాప్తంగా 20కి పైగా మార్గాల్లో రాజధాని రైళ్లు పరుగులు తీస్తున్నాయి.

రాజధాని ఎక్స్‌ ప్రెస్ ప్రత్యేకతలు ఇవే
-భారతీయ రైల్వే ట్రాక్‌లపై గంటకు 130-140 కి.మీ వేగంతో దూసుకుపోగల సత్తా రాజధాని సొంతం. దూర ప్రయాణాలను తక్కువ సమయంలో, కుదుపులు లేని సాఫీ ప్రయాణంతో ముగించడం దీని ప్రత్యేకత.

-ఈ రైలును కింగ్ అని పిలవడానికి ప్రధాన కారణం దీనికి లభించే ప్రాధాన్యత. రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తుందంటే ట్రాక్ క్లియర్ అయిపోవాల్సిందే. దీనిని ఓవర్‌టేక్ చేయడానికి లేదా ఆలస్యం చేయడానికి ఇతర రైళ్లకు అనుమతి ఉండదు. సిగ్నల్స్ అన్నీ దీనికి పచ్చజెండా ఊపుతాయి.

-విమాన ప్రయాణాన్ని తలపించేలా ఇందులో సేవలు ఉంటాయి. రుచికరమైన ఉచిత భోజనం ( టికెట్ ధరలో కలిసి ఉంటుంది), శుభ్రమైన పరుపులు, 24 గంటల పాటు అందుబాటులో ఉండే సిబ్బంది ప్రయాణికులకు రాజభోగాన్ని అందిస్తారు.

-కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాకపోయినా దాదాపు ప్రతి ప్రధాన రాష్ట్ర రాజధానిని, మెట్రో నగరాన్ని కలుపుతూ దీని నెట్‌వర్క్ విస్తరించి ఉంది.

Story first published: Wednesday, November 19, 2025, 21:25 [IST]
Desktop Bottom Promotion