వర్షాలపై బిగ్ అప్డేట్..దూసుకొస్తున్న తుఫాన్!.. అప్పటిదాకా ఆగేదేలే

గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు ప్రజలు నానా అగచాట్లు పడుతున్న వేళ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు అధికారులు. శుక్రవారం(అక్టోబర్ 24) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో నాలుగైదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డీఎమ్ఏ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.

సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారుతుందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని.. అక్టోబర్ 27 నాటికి వాయుగుండంగా బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నట్లు తెలిపారు తుఫాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు.. దీని ప్రభావంతో సోమవారం నుంచి (అక్టోబర్‌ 27) నుంచి మరోసారి నాలుగైదు రోజులు వర్షాలు ఏపీలో పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

weather update telugu states brace for a new storm heavy rains expected for 5 more days

అక్టోబర్‌ 27 నుంచి 29 వరకూ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. శుక్రవారం (అక్టోబర్‌ 24) ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా,నంద్యాల,కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు

తెలంగాణలో పరిస్థితి
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనం ప్రభావంతో ఇవాళ పతు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్ కర్నూల్,నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్,జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, జనగాం, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని మొత్తం 22 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఇక రేపటికి 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Desktop Bottom Promotion