మొంథా ప్రచండం..తీరం దాటినా వీడని గండం..ఇక తెలంగాణ వంతు వచ్చేసింది!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా పెను తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తన ప్రతాపాన్ని చూపింది. మంగళవారం అర్ధరాత్రి కాకినాడకు సమీపంలో తీరం దాటి, కోస్తాంధ్రను అల్లకల్లోలం చేసింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 95 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రచండ గాలులు వీచాయి.

తీరం దాటినప్పటికీ, భూభాగంపై తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతూ ఇంకా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు కదులుతున్న ఈ తుఫాన్ బుధవారం ఛత్తీస్‌ గఢ్‌ దగ్గర బలహీనపడే అవకాశం ఉంది.

weather update today cyclone montha targets telangana heavy rains in these districts

కుండపోత వర్షాలతో కోస్తా విలవిల
మొంథా ప్రభావంతో గత 12 గంటల్లో కోస్తాంధ్రలో రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో ఏకంగా 23 సెం.మీల కుండపోత వర్షం కురవగా, ఉలవపాడు, చీరాల వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాన్ ధాటికి విశాఖ నుంచి తిరుపతి వరకు తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.

ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. వందలాది భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాకినాడ, యానాం తీరాల్లో సముద్రం ముందుకొచ్చి, అలల ఉధృతి భయపెడుతోంది. దీంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అర్థరాత్రి దాకా సచివాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో రాబోయే 24 గంటల్లో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ముప్పు ఇంకా ఉంది
వర్ష భీభత్సం ఈరోజు కూడా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా విద్యాసంస్థలకు సెలవులు కొనసాగనున్నాయి. కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని మంత్రి లోకేష్ తెలిపారు. రాత్రంతా ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేసిన ఆయన తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.

తెలంగాణపై పంజా.. రెడ్, ఆరెంజ్ అలర్ట్‌ లు జారీ
ఆంధ్రను వణికించిన మొంథా ఇప్పుడు తెలంగాణపై తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్ సహా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి, అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

మరో ఏడు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

weather update today cyclone montha targets telangana heavy rains in these districts

స్తంభించిన రవాణా.. విమానాలు రద్దు
తుఫాన్ ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన 35 విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించిన తర్వాతే విమానాశ్రయాలకు రావాలని అధికారులు సూచించారు.

Desktop Bottom Promotion