వానల కోసం వింత ఆచారం, సమాధులు తవ్వి నీళ్లు పోస్తారు.. ఎక్కడో తెలుసా?

భారత్.. ఎన్నో ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల కలబోత. అనేకానేక కులమతాలు, తెగలు ఉన్న మన దేశంలో ఆయా ప్రజలు పాటించే ఆచారాలు కొత్తగా, వింతగా, విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటి ఆచారాలు భారత్ లో చాలానే పాటిస్తుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. ఒకటీ రెండు రోజులు వర్షాలు కురిసినా తర్వాత వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

వానల కోసం వింత, విచిత్రమైన ఆచారాలు:

వర్షాకాలం వస్తుందంటే చాలు అన్నదాతలతో పాటు ప్రజలు తెగ సంతోష పడిపోతుంటారు. కానీ వానా కాలం వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోతే తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఎలాగైనా వర్షం పడేలా చేయాలంటూ వరుణ దేవుడికి అనేక రకాలు పూజలు చేస్తుంటారు. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి ఆచారాలు చాలానే కనిపిస్తుంటాయి. వింత వింత ఆచారాలతో వరుణ దేవుడి కరుణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ప్రజలు.

Weird Traditions Dig Grave And Pour Water To Bring Rains In Karnatakas Vijayapura

కర్ణాటకలో ఒళ్లుగగుర్పొడిచే ఆచారం :

కొన్ని ప్రాంతాల్లో వానల కోసం, వరుణ దేవుడి కరుణ కోసం వింతైన, విచిత్రమైన ఆచారాలు పాటిస్తుంటారు. అలాంటి ఓ వింత ఆచారాన్ని కర్ణాటక విజయపుర జిల్లా తాలికోట్ తాలూకాలోని కలకేరి గ్రామ ప్రజలు పాటిస్తున్నారు. వారి ఆచారం గురించి వింటే ఆశ్చర్యంతో ఒళ్లుగొగుర్పొడుస్తుంది. అందరిలాగే ఈ గ్రామస్థులు కూడా వరుణ దేవుడి కరుణ కోసం పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకుని వానలు కురవాలని ప్రార్థిస్తారు. అయితే పూజాది కార్యక్రమాలే వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి.

వానలు కురవాలని సమాధులు తవ్వి..:

విస్తారంగా వర్షాలు కురవాలని సమాధులను తవ్వుతారు. మృతదేహాలపై నీళ్లు చల్లుతారు. గత 6 నెలల వ్యవధిలో పూడ్చిపెట్టిన సమాధులను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో తవ్వకుండా ఓ పెద్ద రంధ్రం చేస్తారు. అందులో వాటర్ ట్యాంకర్ల పైపులను పెట్టి నీళ్లు పోస్తారు. ఈ వింత ఆచారాన్ని దశాబ్దాలుగా పాటిస్తున్నట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. సమాధులు తవ్వి నీళ్లు పోసిన తర్వాత.. పూడ్చి వాటిపై కూర్చొని ప్రార్థనలు చేస్తారు.

శాపం తొలగిపోయి వర్షాలు కురుస్తాయని..:

పితృ దేవతలు వానలు కురవకుండా శాపం విధిస్తారని, దాని వల్లే వర్షాలు కురవవని స్థానికులు అంటున్నారు. ఆ శాపం తొలగిపోయి వానలు కురవడానికి ఈ ఆచారం దశాబ్దాలుగా పాటిస్తున్నట్లు చెబుతున్నారు. సమాధులు తవ్వి వాటిపై నీళ్లు పోయడం వల్ల ఆత్మలు శాంతించి వానలు కురిసేందుకు అడ్డు తప్పుకుంటాయని స్థానికులు వెల్లడించారు. వరుణ దేవుడి కరుణ వల్ల వానలు విస్తారంగా కురుస్తాయని వివరిస్తున్నారు.

ఇలా చేస్తే 10 రోజుల్లో వర్షాలు!:

ఇలా సమాధులను తవ్వి మృతదేహాలపై నీళ్లు పోసే ఆచారాన్ని పాటించడం వల్ల శాపం తొలగిపోయి 10 రోజుల్లో వానలు కురుస్తాయన్నది స్థానికుల నమ్మకం. విజయపుర జిల్లాలోని కలకేరి గ్రామ జనాభా కేవలం 1500. ఈ చిన్న తెగ ప్రజలు ఈ ఆచారాన్ని అనాది నుండి పాటిస్తూ వస్తున్నట్లు తెగకు చెందిన వారు చెబుతున్నారు. గతేడాది కూడా వానలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఆచారాన్ని పాటించడం వల్ల 10 రోజుల్లో వర్షాలు కురిశాయని అంటున్నారు. హిరేమఠానికి చెందిన వాగీష్ స్వామీజి ఆధ్వర్యంలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు స్థానికులు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Thursday, July 6, 2023, 15:20 [IST]
Desktop Bottom Promotion