రోజూ బంగారం ధరలను పెంచడం,తగ్గించడం చేసేది ఎవరో తెలుసా!

ప్రస్తుతం మనదేశంలో దేనిగురించైనా ఎక్కువగా మీడియాలో కానీ లేదా జనాల్లో కానీ చర్చ జరుగుతుంది అది బంగారం గురించే. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరగడం, తర్వాత మళ్లీ తగ్గడం, మళ్లీ పెరుగుతుండం ఇలా బంగారం వైపే అందరి కన్ను ఉంది.

దీని గురించి అందరిలో ఇంత ఆసక్తి ఉంటానికి కారణం.. భారతీయులకు బంగారం అంటే కేవలం లోహం కాదు, అది ఒక ఎమోషన్. పేదవాడి నుంచి ధనికుడి వరకు ప్రతి ఒక్కరూ తులం బంగారమైనా కొనాలని కలలు కంటారు.

Who Decides Gold Prices Daily Meet the Masterminds Behind Indias Bullion Rates

ఉదయం లేవగానే వార్తల్లో బంగారం ధర పెరిగిందా, తగ్గిందా అని చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. అసలు రోజురోజుకూ మారుతున్న ఈ రేట్లను ఎవరు ఫిక్స్ చేస్తారు? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అని ఎప్పుడైనా ఆలోచించారా?

ధరను ఎవరు నిర్ణయిస్తారు?
చాలామంది అనుకునేటట్లుగా బంగారం ధరను ప్రభుత్వం నేరుగా నిర్ణయించదు. అలాగే ప్రధాని కానీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కానీ రోజువారీ రేట్లను ఫిక్స్ చేయరు.

భారత్‌లో బంగారం ధరలను నిర్ణయించడంలో ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ దేశంలోని అతిపెద్ద బంగారం డీలర్ల నుండి కొనుగోలు,అమ్మకం కోట్ ‌లను సేకరించి, వాటి సగటు ఆధారంగా ఒక బెంచ్‌ మార్క్ రేటును నిర్ణయిస్తుంది.

ఈ రేటు ఆధారంగానే వివిధ నగరాల్లోని జువెలర్స్ అసోసియేషన్లు స్థానిక పన్నులు, రవాణా ఖర్చులను కలుపుకుని ఆ రోజు ధరను ప్రకటిస్తాయి.

ఎలా నిర్ణయిస్తారు?
బంగారం ధర నిర్ణయించడానికి ఒక పెద్ద ఫార్ములానే ఉంది. మన దేశం మనకు కావాల్సిన బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA), అమెరికా డాలర్ విలువ మన ధరలను శాసిస్తాయి.

ముఖ్యంగా ఈ అంశాల ఆధారంగా ధరను లెక్కిస్తారు

అంతర్జాతీయ బంగారం ధర: లండన్ లేదా న్యూయార్క్ మార్కెట్లో ఒక ఔన్స్ (సుమారు 31 గ్రాములు) బంగారం రేటు ఎంత ఉందో చూస్తారు.

కరెన్సీ మారకం విలువ: అంతర్జాతీయంగా బంగారం డాలర్లలో ఉంటుంది. మన రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే తగ్గితే, బంగారం ధర పెరుగుతుంది.

దిగుమతి సుంకం (Import Duty): విదేశాల నుండి వచ్చే బంగారంపై భారత ప్రభుత్వం విధించే పన్ను. ఇది పెరిగితే ఆటోమేటిక్‌గా బంగారం ధర పెరుగుతుంది.

Who Decides Gold Prices Daily Meet the Masterminds Behind Indias Bullion Rates

ఎందుకు పెరుగుతుంది?

బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉంటాయి.

డిమాండ్, సప్లై: భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ లేదా అక్షయ తృతీయ, దీపావళి పండుగలప్పుడు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ పెరిగితే ధర ఆకాశాన్ని తాకుతుంది.

అంతర్జాతీయ ఉద్రిక్తతలు: ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, లేదా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నా.. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి, సురక్షితమైన బంగారంలో పెట్టుబడి పెడతారు. దీన్నే సేఫ్ హెవెన్ అంటారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి.

సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంకులు తమ దగ్గర బంగారం నిల్వలను పెంచుకోవడం మొదలుపెడితే, మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.

ద్రవ్యోల్బణం: మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు, రూపాయి విలువ తగ్గుతుంది. అప్పుడు డబ్బును కాపాడుకోవడానికి ప్రజలు బంగారాన్ని ఆశ్రయిస్తారు.

ఇవాళ(ఫిబ్రవరి 4,2026)బంగారం ధరలు ఇలా

-24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర బుధవారం రూ.660 పెరిగి రూ. 16,053గా ఉంది.

-22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.605 పెరిగి రూ. 14,715 దగ్గర ట్రేడ్ అవుతుంది.

-18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.495 పెరిగి రూ. 12,040గా ఉంది.

Desktop Bottom Promotion