భోగి పళ్లు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకుంటాయి. మూడు రోజుల పండుగలో మొదటి రోజైన భోగి అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఈ ఏడాది జనవరి 14న భోగి పండుగను జరుపుకుంటున్నాం.

ఇవాళ ఉదయాన్నే భోగి మంటల సందడి ఒకెత్తయితే సాయంత్రం వేళ ఇంట్లో జరిగే భోగి పళ్ల వేడుక మరో ఎత్తు. ఐదేళ్ల లోపు పిల్లలను అందంగా ముస్తాబు చేసి, వారి తలపై రేగి పండ్లను పోయడం మన అనాది సంప్రదాయం. అసలు ఈ పళ్లను ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

Why Do We Shower Bhogi Pallu on Kids Tradition Meets Science

శ్రీమన్నారాయణుడి ప్రతిరూపం - రేగి పండు
భోగి రోజున పోసే పండ్లను భోగి పళ్లు అంటారు కానీ, వాస్తవానికి అవి రేగి పళ్లు. ఈ పండుకు పురాణాల్లో గొప్ప విశిష్టత ఉంది. రేగి పండును సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. బదరీ ఫలం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని మన పూర్వీకుల నమ్మకం.

ఈ పండు ఎర్రగా, గుండ్రంగా ఉండి సూర్యుడిని పోలి ఉంటుంది. భోగి పండుగ నాటికి సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు, శ్రీమన్నారాయణుడి రక్ష పిల్లలకు ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే వారి తలపై ఈ పండ్లను పోస్తారు.

దిష్టి నివారణకు అద్భుత ఔషధం
పిల్లలకు త్వరగా దిష్టి తగులుతుందని పెద్దలు చెబుతుంటారు. భోగి పళ్ల వేడుకలో రేగి పళ్లతో పాటు చిల్లర నాణేలు, పూల రేకులు, చెరుకు ముక్కలు, అక్షతలు కలుపుతారు.

రేగి పళ్లు తలపై పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి (Negative Energy) తొలగిపోతుందని నమ్మకం.

నాణేలు.లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకూడదని సంకేతం.

పూలు..పిల్లల జీవితం పూలలా సున్నితంగా, అందంగా వికసించాలని ఆశీర్వాదం.
ఇవన్నీ కలిపి తలపై పోసి, హారతి ఇవ్వడం ద్వారా పిల్లలకు ఉన్న సమస్త పీడలు, దిష్టి దోషాలు తొలగిపోతాయని ప్రతీతి.

ఆరోగ్య రహస్యం
ఈ సంప్రదాయం వెనుక ఒక బలమైన ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది. భోగి పండుగ వచ్చేది చలికాలంలో. ఈ సమయంలో చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు రావడం సహజం. రేగి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పిల్లల తల మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. రేగి పళ్లను తలపై పోసినప్పుడు అవి ఆ భాగాన్ని తాకడం వల్ల అక్కడి నాడులు ఉత్తేజితమవుతాయని తద్వారా పిల్లల జ్ఞానశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

సామాజిక బంధం
ఈ వేడుక కేవలం ఇంటికే పరిమితం కాదు. సాయంత్రం వేళ పేరంటం ఏర్పాటు చేసి, ఇరుగుపొరుగున ఉండే ముత్తైదువలను పిలుస్తారు. అందరూ కలిసి పిల్లలను ఆశీర్వదించడం వల్ల సామాజిక బంధాలు బలపడతాయి.

పెద్దల ఆశీర్వాదం పిల్లలకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. కాబట్టి భోగి పళ్లు పోయడం అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. అది పిల్లల ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యానికి పెద్దలు వేసే బలమైన పునాది.

Story first published: Wednesday, January 14, 2026, 7:22 [IST]
Desktop Bottom Promotion