సుగంధ ద్రవ్యాల మేళవింపుతో.. మర్చిపోలేని రుచినిచ్చే ఆలూ యఖ్ని పులావ్

Posted By:

యఖ్ని పులావ్ అనేది కాశ్మీరీ వంటకాలలో ఒక ప్రత్యేకమైన వంటకం. సాధారణంగా మాంసంతో చేసే ఈ పులావ్‌ ను, మనం బంగాళదుంపలతో అంతే రుచిగా శాఖాహార పద్ధతిలో తయారుచేసుకోవచ్చు. యఖ్ని అంటే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చిక్కటి ద్రవం.

ఈ యఖ్నితో ఉడికించడం వలనే ఈ పులావ్‌ కు ఒక ప్రత్యేకమైన సువాసన, రుచి వస్తాయి. ఇది సాధారణ పులావ్‌ లా కాకుండా, పెరుగు,మసాలా దినుసుల మేళవింపుతో ఎంతో రుచిగా ఉంటుంది.

Authentic Kashmiri Aloo Yakhni Pulao A Royal Vegetarian Feast

కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
బంగాళదుంపలు - 3 పెద్దవి
ఉల్లిపాయలు - 2
నెయ్యి లేదా నూనె - 4 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3
షాజీరా - 1 టీస్పూన్
బిర్యానీ ఆకు - 2
ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు - 1 కప్పు
సోంపు గింజలు - 2 టీస్పూన్లు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
నల్ల యాలకులు - 1
పచ్చి యాలకులు - 4
లవంగాలు - 5
నల్ల మిరియాలు - 10
నీళ్లు - 4 కప్పులు
గార్నిష్ కోసం:
వేయించిన ఉల్లిపాయలు- కొద్దిగా
కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా

Authentic Kashmiri Aloo Yakhni Pulao A Royal Vegetarian Feast

తయారీ విధానం

-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి, పెద్దగా కోసుకున్న బంగాళదుంప ముక్కలను బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు సోంపు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంలో వేసి, గట్టిగా ఒక మూట కట్టాలి.

-ఒక గిన్నెలో గట్టి పెరుగును ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. దానికి 4 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

-ఈ పెరుగు మిశ్రమంలో మనం తయారు చేసుకున్న మసాలా మూటను వేసి, గిన్నెను పొయ్యి మీద పెట్టాలి. చిన్న మంట మీద సుమారు 15-20 నిమిషాల పాటు మరిగించాలి. మసాలాల సువాసన అంతా ఆ నీటిలోకి దిగి, రుచికరమైన యఖ్ని తయారవుతుంది. తర్వాత మసాలా మూటను తీసి పక్కన పెట్టేయాలి.

-ఇప్పుడు ఒక మందపాటి గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్‌ లో నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగాక, షాజీరా, బిర్యానీ ఆకులు వేసి చిటపటలాడనిచ్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారేవరకు బాగా వేయించాలి.

-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చి వాసన పోయేవరకు ఒక నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు నానబెట్టిన బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి ఆ బియ్యాన్ని గిన్నెలో వేసి, గరిటతో మెల్లగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.

-ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి కలపాలి.

-చివరగా మనం సిద్ధం చేసుకున్న యఖ్ని నీటిని ఇందులో పోయాలి. ఒకసారి ఉప్పు సరిచూసుకొని, అవసరమైతే కొద్దిగా వేసి, బాగా కలపాలి.

-గిన్నెపై మూత పెట్టి, ముందుగా అధిక మంటపై ఒక పొంగు రానివ్వాలి. తర్వాత మంటను సిమ్‌ లో పెట్టి, అన్నం పూర్తిగా ఉడికి, నీరంతా ఇగిరిపోయే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్ వాడితే, 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే సరిపోతుంది.

-స్టవ్ ఆఫ్ చేశాక, మూత తీయకుండా మరో 10 నిమిషాల పాటు అన్నాన్ని దమ్‌లో వదిలేయాలి. దీనివల్ల ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి, ఒక ఫోర్క్‌తో మెల్లగా అన్నాన్ని కదిపితే పొడిపొడిగా వస్తుంది.

-పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరుగుతో అలంకరించి, వేడివేడిగా రైతాతో వడ్డించండి. అంతే నోరూరించే ఆలూ యఖ్ని పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 11, 2025, 15:09 [IST]
Desktop Bottom Promotion