అదిరిపోయే రుచి..కేరళ స్టైల్ చేపల కూర ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు

Posted By:

నాన్ వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్, మటన్ కంటే చేపలనే ఎక్కువగా ఇష్టపడతారు. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, అద్భుతమైన రుచిని అందించడం చేపల ప్రత్యేకత. చేపలను వేయించినా, పులుసు పెట్టినా ఆ రుచే వేరు. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటల శైలి ఉంటుంది. అయితే కేరళ స్టైల్ ఫిష్ కర్రీ మాత్రం ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.

కేరళ అనగానే గుర్తొచ్చేది అక్కడి సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి. కేరళ వంటకాల్లో వాడే మసాలాలు, కొబ్బరి మిశ్రమం చేపల కూరకు ఒక కమ్మని, రిచ్ టేస్ట్‌ ను ఇస్తాయి. మీ వంటింట్లోనే సింపుల్ అండ్ టేస్టీ కేరళ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Authentic Kerala Fish Curry Recipe in Telugu

కావలసిన పదార్థాలు
చేప ముక్కలు - అర కిలో
చిన్న ఉల్లిపాయలు - 10
టమోటా - 1
తురిమిన కొబ్బరి - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 3
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజు
కారం - 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు
పసుపు -అర టేబుల్ స్పూన్
ఆవాలు 1 టేబుల్ స్పూన్
జీలకర్ర 1 టేబుల్ స్పూన్
మెంతులు - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - ఒక్కోటి 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
నూనె, ఉప్పు - తగినంత

తయారీ విధానం

-ముందుగా చేప ముక్కలను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. చింతపండును నీళ్లలో నానబెట్టి, చిక్కటి రసం తీసి సిద్ధం చేసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి మీడియం మంటపై ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి దోరగా వేయించండి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పొడిలా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో కొద్దిగా నూనె వేడి చేసి, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన చిన్న ఉల్లిపాయలు వేసి వేయించండి. తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.

-ఇప్పుడు పాన్ లో పసుపు, కారం, ధనియాల పొడి, ముందుగా రుబ్బుకున్న మసాలా పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించండి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్‌ లో వేసి, దానికి తురిమిన కొబ్బరి, కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-వెడల్పాటి పాన్ లేదా మట్టి పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించండి. తర్వాత సిద్ధం చేసుకున్న కొబ్బరి-మసాలా పేస్ట్, తగినంత ఉప్పు, ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి.

-ఈ మిశ్రమంలో చింతపండు రసం పోసి మూత పెట్టి గ్రేవీని బాగా మరిగించాలి. గ్రేవీ మరుగుతున్నప్పుడు, కడిగి పెట్టుకున్న చేప ముక్కలను నెమ్మదిగా అందులో వేయాలి. గరిటెతో ఎక్కువగా తిప్పకుండా, పాత్రను అటు ఇటు కదుపుతూ కలపాలి.

-మూత పెట్టి 5-7 నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించాలి. చివరగా తాజా కరివేపాకు చల్లి, స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఘుమఘుమలాడే కేరళ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, December 21, 2025, 14:54 [IST]
Desktop Bottom Promotion