రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా? కమ్మటి ఉల్లిపాయ-పల్లీ పరాఠా ట్రై చేయండి..టేస్ట్‌ లో వేరే లెవెల్!

Posted By:

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ అనగానే రొటీన్‌ గా ఇడ్లీ, దోశ, లేదా మామూలు చపాతీలే గుర్తొస్తాయా? ఎప్పుడూ అవే తిని బోర్ కొట్టిందా? అయితే కాస్త వెరైటీగా, ఎంతో రుచికరంగా ఉండే ఉల్లిపాయ- పల్లీ స్టఫ్డ్ పరాఠా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్‌ కైనా, వీకెండ్ స్పెషల్ బ్రేక్‌ ఫాస్ట్‌ కైనా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.

ఉల్లిపాయ-పల్లీ స్టఫ్డ్ పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు

గోధుమ పిండి - తగినంత
నెయ్యి - 1 టీస్పూన్
ఉప్పు - చిటికెడు
నీళ్లు - సరిపడా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు - 2
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
కారం - అర టేబుల్ స్పూన్
గరం మసాలా - పావు టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - పావు టేబుల్ స్పూన్
వేరుశెనగ గుళ్లు - గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - 4
సోంపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - కొద్దిగా

Bored of Regular Breakfast Try This Delicious Onion-Peanut Stuffed Paratha Recipe in Telugu

ఉల్లిపాయ-పల్లీ స్టఫ్డ్ పరాఠా తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ కరిగించిన నెయ్యి వేసి చేతులతో బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని మృదువైన చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా పైన కాస్త నెయ్యి రాసి, మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

-ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో వేరుశెనగలు, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు సోంపు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో 3 టీస్పూన్ల నూనె వేడి చేశాక ఉల్లిపాయ ముక్కలు వేసి ముక్కలు లేత రంగులోకి మారేంతవరకు వేయించిన తర్వాత అందులో ధనియాల పొడి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మంటను సిమ్‌ లో ఉంచి, మసాలాల పచ్చి వాసన పోయేలా 3 నిమిషాల పాటు వేయించాలి.

-తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశెనగ పొడిని ఈ మిశ్రమంలో వేసి మరో నిమిషం పాటు కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మసాలా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-నానబెట్టిన పిండిలోంచి నిమ్మకాయంత ముద్దను తీసుకుని, చిన్న చపాతీలా ఒత్తుకోవాలి. దీని మధ్యలో మనం తయారు చేసిన మసాలాను పెట్టి, అంచులన్నీ దగ్గరకు తీసుకువస్తూ స్టఫింగ్ బయటకు రాకుండా మూసివేయాలి. దీన్ని పొడి పిండి చల్లుతూ, మసాలా బయటకు రాకుండా తేలికగా పరాఠాలా రుద్దుకోవాలి.

-స్టవ్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం వేడెక్కాక ఈ పరాఠాను వేసి, రెండు వైపులా నూనె లేదా నెయ్యి రాస్తూ ఎర్రబడే వరకు కాల్చుకోవాలి.

-అంతే ఉల్లిపాయ స్టఫ్డ్ పరాఠా రెడీ. దీన్ని చల్లని పెరుగుతో లేదా కమ్మని రైతాతో తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Sunday, March 29, 2026, 18:25 [IST]
Desktop Bottom Promotion