రొటీన్ చట్నీలతో బోర్ కొట్టిందా? 5 నిమిషాల్లో ఈ రోడ్ సైడ్ స్టైల్ చట్నీ ట్రై చేయండి..ఇడ్లీలు ఎన్నైనా తినేస్తారు!

Posted By:

చాలా ఇళ్లలో ఇడ్లీకి సాంబార్ కంటే చట్నీనే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ, ఎప్పుడూ ఒకే రకమైన కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ తిని తిని మీకు బోర్ కొట్టిందా? అయితే రోడ్డు సైడ్ టిఫిన్ బండి స్టైల్ వేరుశనగ చట్నీ ట్రై చేయండి.

బయట బండి మీద,టిఫిన్ సెంటర్లలో దొరికే చట్నీ ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇడ్లీలో ఆ చట్నీని ముల్చుకుని తింటే ఎన్ని ఇడ్లీలు తింటున్నామో కూడా లెక్క తెలియదు. అదే రుచితో, అతి తక్కువ సమయంలో, కేవలం 5 నిమిషాల్లో ఆ టేస్టీ,స్పైసీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పల్లీలు- అర కప్పు
సాంబార్ ఉల్లిపాయలు- 6
వెల్లుల్లి రెబ్బలు - 6
ఎండు మిరపకాయలు - 5
పచ్చి కొబ్బరి తురుము లేదా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు - చిన్న రెబ్బ
కరివేపాకు - 1 రెబ్బ
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. వెల్లుల్లి వేగాక అందులో ఎండు మిరపకాయలు, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి.

-చిన్న ఉల్లిపాయలు మగ్గి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చివరగా చిన్న చింతపండు రెబ్బను కూడా వేసి కాస్త వేయించి స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో పల్లీలు వేసి సన్నని మంటపై బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా జాగ్రత్తపడండి, లేదంటే చట్నీ రుచి మారుతుంది. వేయించిన పల్లీలను కూడా పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

-వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమం, పల్లీలు పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్‌ లోకి తీసుకోండి. ఇందులోనే రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా నీళ్ళు పోయకుండా బరకగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత అవసరమైనన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-మిక్సీ పట్టిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని, మరికొన్ని నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలి. ఇడ్లీలో మునిగేలా ఉంటేనే దీని అసలైన రుచి.

-తాలింపు కోస స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించి, ఆ తాలింపును చట్నీలో వేసి కలపాలి. అంతే ఘమఘమలాడే సాంప్రదాయక వేరుశనగ చట్నీ రెడీ.

-వేడి వేడి ఇడ్లీపై ఈ చట్నీని ధారాళంగా పోసుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది. దోసె, ఊతప్పం, పొంగల్‌ లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్.

[ of 5 - Users]
Story first published: Sunday, November 30, 2025, 13:00 [IST]
Desktop Bottom Promotion