వడలు లేకుండానే అచ్చమైన చెన్నై వడ కర్రీ..సెట్ దోశ, పూరీలోకి కిర్రాక్ కాంబో!

Posted By:

దక్షిణ భారత వంటకాల్లో ముఖ్యంగా చెన్నై స్ట్రీట్ ఫుడ్ లో వడ కర్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇడ్లీ, దోశ, సెట్ దోశ, పూరీ, చపాతీలలోకి నంజుకోవడానికి వడ కర్రీ అద్భుతమైన సైడ్ డిష్. మిగిలిపోయిన మసాలా వడలను వృధా చేయకుండా, వాటితో ఒక రుచికరమైన గ్రేవీని తయారు చేసే సంప్రదాయం నుండి ఈ వంటకం పుట్టింది.

వడ కర్రీ కేవలం రుచికి మాత్రమే కాదు, ఇందులో వాడే పోషక విలువలున్న పదార్థాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే వడలు కూడా లేకుండానే ఈ వడ కర్రీని మీ ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చెన్నై వడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-శెనగపప్పు
-ఎండుమిరపకాయలు
-సోంపు గింజలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-పచ్చిమిరపకాయలు
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-యాలకలు
-లవంగాలు
-టమాటో
-ఉల్లిపాయ
-కారం
-ఉప్పు
-పసుపు
-కరివేపాకు
-ధనియాల పొడి
-అనాస పువ్వు

చెన్నై వడ కర్రీ తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో 200 గ్రాముల శెనగపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీటిని వంపేయండి.

-ఇప్పుడు కడిగిన శెనగపప్పులో 3 ఎండుమిరపకాయలు, 1 టీస్పూన్ సోంపు గింజలు వేసి,సరిపడా నీళ్లు పోసి కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలి.

-2 గంటల తర్వాత నీళ్లు వంపేసి నానబెట్టిన పప్పు మొత్తం మిక్సీ గిన్నెలో వేసి రుబ్బుకోవాలి. మరీ పేస్ట్ లా కాకుండా కాస్త కచ్చాపచ్చాగ గ్రైండ్ చేసుకోవాలి.

-స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టి 3 టీస్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తం వేసి మీడియం మంట మీద బాగా వేయించాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోండి. మిశ్రమం బాగా రోస్ట్ అయిన తర్వాత దీనిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.

-ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు(జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, యాలకలు, లవంగం, దాల్చిన చెక్క,సోంపు, అనాస పువ్వు)వేసి వేయించాక ఇందులో 2 పెద్ద ఉల్లిపాయల సన్నని తరుగు, 5 పచ్చిమిరపకాయలు వేసి వేయిచాలి.

-ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో 2 టీస్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 2 సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి ఇవి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.

-టమాటో ముక్కలు కొంచెం మెత్తబడగానే అందులో 1 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల కారం, అర టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్నాక అందులో కలిపి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి.

-1 నిమిషం తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి వేయించుకున్న శనగపప్పు మిశ్రమం వేసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

-తర్వాత మూత తీసి అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే చెన్నై స్టైల్ వడ కర్రీ రెడీ. గ్రేవీ మరీ గట్టిగా అయిపోతే, కొద్దిగా వేడి నీళ్లు పోసి కలుపుకోవచ్చు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion