కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి

Posted By:

భోజనంలో ఎప్పుడూ ఒకేరకమైన పప్పు, సాంబార్, రసం తిని మీకు బోర్ కొట్టిందా? అయితే కర్ణాటక స్పెషల్ దోసకాయ మజ్జిగ పులుసు ఓ సారి రుచి చూడాల్సిందే. ఇదొక అద్భుతమైన, చల్లని సాంప్రదాయ వంటకం. ముఖ్యంగా వేడి అన్నంలో ఈ కమ్మటి మజ్జిగ పులుసు కలుపుకుని తింటుంటే ఆ మజాయే వేరు. ఇది పొట్టకు చాలా చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఇంట్లోని సాధారణ పదార్థాలతోనే, పది నిమిషాల్లో అప్పటికప్పుడు ఎంతో రుచికరంగా దోసకాయ మజ్జిగ పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Cooling and Delicious Karnataka Special Dosakaya Majjiga Pulusu Recipe in Telugu

దోసకాయ మజ్జిగ పులుసు తయారకి కావలసిన పదార్థాలు

లేత దోసకాయలు - 2
కమ్మని పెరుగు - 1 కప్పు
నూనె - 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - 2
జీలకర్ర - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చి మిర్చి - 2
ఆవాలు - అర టీస్పూన్
ఉల్లిపాయ - 1
కరివేపాకు - రెండు రెమ్మలు
పసుపు - చిటికెడు

Cooling and Delicious Karnataka Special Dosakaya Majjiga Pulusu Recipe in Telugu

దోసకాయ మజ్జిగ పులుసు తయారీ విధానం

-ముందుగా మజ్జిగ పులుసుకు ప్రాణమైన మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ వంటకానికి అద్భుతమైన రుచిని, చిక్కదనాన్ని ఇస్తుంది.

-ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా గిలకొట్టండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి, మజ్జిగ మరీ పలుచగా కాకుండా, కొంచెం చిక్కగా ఉండేలా కలుపుకొని పక్కన ఉంచుకోండి.

-దోసకాయలను శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

-స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. ఒక రెండు నిమిషాల తర్వాత అందులో కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.

-ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను స్టవ్ మీదున్న కడాయిలో వేసి ఒక నిమిషం పాటు నూనెలో మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మసాలా పేస్ట్‌ ను వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి. దీనిలో అరకప్పు నీళ్లు పోసి మసాలా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు ఉడికించండి.

-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత, ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగను ఇందులో పోసి బాగా కలుపుకోవాలి.

-మజ్జిగ పులుసుకు కాస్త పుల్లటి పెరుగు వాడితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. దోసకాయ ముక్కలు మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం కరకరలాడుతుంటేనే తినేటప్పుడు బాగుంటుంది.

-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే దోసకాయ మజ్జిగ పులుసు రెడీ. వేడి వేడి అన్నం, అప్పడాలు లేదా వడియాలతో ఈ మజ్జిగ పులుసు కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, May 7, 2026, 14:16 [IST]
Desktop Bottom Promotion