వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా!

Posted By:

బ్రేక్ ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ. కానీ అప్పుడప్పుడు రొటీన్‌ కు భిన్నంగా, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు రైస్‌ తో చేసే వెరైటీలు బెస్ట్ ఆప్షన్. మనలో చాలామందికి పలావ్, పులిహోర, చిత్రాన్నం లాంటి వంటకాలంటే మహా ఇష్టం. ఇవి పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి.

అయితే ఈ జాబితాలో ఎప్పటికీ ముందు వరుసలో ఉండే మరో అద్భుతమైన వంటకం వాంగీ బాత్. కర్ణాటకలో బ్రేక్ ఫాస్ట్ లో వంగీ బాత్ ఫేమస్. వంకాయతో చేసే ఈ మసాలా వాంగీ బాత్ అంటే ఇష్టపడని వారుండరు. ఘుమఘుమలాడే సుగంధ ద్రవ్యాలతో, కాస్త స్పైసీగా ఉండే ఈ వంటకాన్ని ఎంతో సులభంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Craving Something Spicy Try This Authentic Karnataka Style Masala Vangi Bath Recipe in Telugu

మసాలా వంగీ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం - 1 కప్పు
లేత వంకాయలు - 3 లేదా 4
ఉల్లిపాయలు - 2
టొమాటో - 1
పచ్చిమిర్చి - 3
చింతపండు రసం - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - చిటికెడు
కారం - 1 టీస్పూన్
వాంగీ బాత్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
వంట నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

మసాలా వంగీ బాత్ తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే వంకాయలను సన్నగా, పొడవుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి ఉంచాలి.

-స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో తగినంత నూనె పోసి వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.

-ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కుక్కర్‌ లో వేసి బాగా కలపాలి. ఇందులోనే పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమంలో వాంగీ బాత్ పౌడర్ వేసి నిదానంగా కలపాలి. ఇదంతా పేస్ట్‌ లా తయారయ్యాక, ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోయాలి.

-ఈ మిశ్రమం కొద్దిగా ఉడుకుతుండగా, ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున నీళ్లు పోయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వడకట్టి కుక్కర్‌ లో వేయాలి.

-బియ్యం వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకుని నిదానంగా కలుపుకోవాలి.

-అంతే మసాలా వాంగీ బాత్' రెడీ. పెరుగు రైతాతో వడ్డించుకుంటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Sunday, March 15, 2026, 18:02 [IST]
Desktop Bottom Promotion