లొట్టలేసుకుంటూ తినే లసుని మేథి కర్రీ..ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే

Posted By:

చలికాలంలో మార్కెట్లో తాజా ఆకుకూరలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ లో ఆకుపచ్చని కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎప్పుడూ చేసుకునే మెంతి కూర, పప్పు కాకుండా కాస్త కొత్తగా, రెస్టారెంట్ రుచిని తలపించేలా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే లసుని మేథి ట్రై చేయాల్సిందే. దీనిని వెల్లుల్లి మెంతి కూర అని కూడా పిలుస్తారు.

మెంతి ఆకులోని స్వల్ప చేదు, వెల్లుల్లి ఘాటైన రుచి,భారతీయ మసాలాల కమ్మని సువాసనల కలయికే ఈ వంటకం. ఇది కేవలం నిమిషాల్లో తయారవుతుంది కానీ దీని రుచి మాత్రం మీకు చాలా కాలం గుర్తుండిపోతుంది. వేడి వేడి రోటీల్లోకి లేదా అన్నంలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. దాబా స్టైల్ లసుని మేథి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Dhaba Style Lasooni Methi at Home A Perfect Winter Treat Recipe in Telugu

కావలసిన పదార్థాలు
మెంతి కూర - 1 పెద్ద కట్ట
వెల్లుల్లి రెబ్బలు - 15 నుండి 20
ఉల్లిపాయలు - 3
టమోటాలు - 3
నూనె - 2 టీస్పూన్లు
నెయ్యి - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు -సరిపడా
వేరుశనగ పప్పు (పల్లీలు) - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - 1 టీస్పూన్
వేయించిన శనగపప్పు (పుట్నాల పప్పు) - 1 టీస్పూన్

Dhaba Style Lasooni Methi at Home A Perfect Winter Treat Recipe in Telugu

తయారీ విధానం

-మొదటగా మెంతి కూర కట్టను తీసుకుని, ఆకులను వేరు చేసి నీటిలో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆకులను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్‌ పెట్టి అందులో వేరుశెనగలు, తెల్ల నువ్వులు,పుట్నాల పప్పును దోరగా వేయించండి. అవి చల్లారాక మిక్సీ జార్‌ లో వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే పాన్‌ లో కొద్దిగా నూనె వేడి చేసి 10 వెల్లుల్లి రెబ్బలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. వెల్లుల్లి వేగిన తర్వాత అందులో తరిగిన మెంతి ఆకును వేసి తక్కువ మంట మీద మూత పెట్టి ఉడికించండి. ఉడికిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-ఇప్పుడు పాన్‌ లో నెయ్యి, నూనె వేసి వేడి చేశాక ఇందులో జీలకర్ర, చిటికెడు ఇంగువ వేయండి. జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపండి. తర్వాత తరిగిన టమోటాలను వేసి అవి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు ఉడికించాలి.

-టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పేస్ట్ వేసి బాగా కలపాలి. గ్రేవీ నుండి నూనె వేరు పడుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి-మెంతి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపండి.

-అవసరమైతే కొద్దిగా వేడి నీరు పోసి గ్రేవీ చిక్కదనాన్ని సరిచేసుకోండి. మరో 2 నిమిషాలు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన లసుని మేథి రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, January 2, 2026, 8:32 [IST]
Desktop Bottom Promotion