రాత్రి మిగిలిన పప్పును పారేస్తున్నారా? ఒక్కసారి ఇలా దాల్ పరాఠా ట్రై చేయండి, లొట్టలేస్తారు!

Posted By:

మనలో చాలా మంది ఇళ్లలో తరచుగా రాత్రి భోజనం అయ్యాక గిన్నెలో కొంచెం పప్పు మిగిలిపోతుంటది. దాన్ని ఫ్రిజ్‌ లో పెట్టి మరుసటి రోజు తినాలా? లేక పారేయాలా? అని ఆలోచిస్తుంటాం. చాలా సార్లు అది పాడైపోతుందేమోనని లేదా చల్లబడిన పప్పు రుచిగా ఉండదని పారేయడమే జరుగుతుంది. కానీ,ఆ మిగిలిపోయిన పప్పుతో నిమిషాల్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?

మిగిలిపోయిన పప్పుతో సూపర్ టేస్టీ పరాఠా చేసుకోవచ్చు. ఇది కేవలం ఆహారాన్ని వృథా చేయకుండా ఉండటమే కాదు, అద్భుతమైన రుచిని కూడా ఇస్తుంది. మామూలు చపాతీలు తిని బోర్ కొట్టిన వారికి ఇదొక కొత్త రుచిని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు పప్పు తినడానికి మారం చేస్తుంటే, ఇలా పరాఠా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. ఒక్కసారి ఈ దాల్ పరాఠా రుచి చూస్తే, మీరు బంగాళాదుంప పరాఠాలను కూడా మర్చిపోతారు. మిగిలిపోయిన పప్పుతో సూపర్ టేస్టీ పరాఠా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Forget Aloo Paratha Try This Crispy Leftover Dal Paratha Recipe in Telugu

కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన పప్పు(ఏ పప్పు అయినా): 1 కప్పు
గోధుమ పిండి: ఒకటిన్నర కప్పు
జీలకర్ర: అర టీస్పూన్
వాము: అర టీస్పూన్
కారం పొడి: అర టీస్పూన్
ధనియాల పొడి: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
నెయ్యి లేదా నూనె: కాల్చడానికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని వేయండి. ఇప్పుడు ఈ పిండిలో జీలకర్ర, వాము, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి. మీరు కావాలనుకుంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా ఈ దశలో కలుపుకోవచ్చు.

-ఇప్పుడు పిండిలో నీళ్లు పోయడానికి బదులుగా, మీ దగ్గర ఉన్న మిగిలిపోయిన పప్పును కొద్దికొద్దిగా వేస్తూ పిండిని కలపడం ప్రారంభించండి. పప్పులో ఉండే తేమ పిండి కలపడానికి సరిపోతుంది. ఒకవేళ పప్పు మరీ గట్టిగా ఉంటే తప్ప, అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం రాదు. పిండి..చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.

-పిండిని బాగా మర్దన చేస్తూ కలిపిన తర్వాత దానిపై మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.

-తర్వాత నానిన పిండిని తీసుకుని, సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోండి. ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి అద్దుకుంటూ గుండ్రని పరాఠాల్లా ఒత్తుకోండి. ఇవి కొంచెం మందంగా ఉంటే రుచి బాగుంటుంది.

-స్టవ్ మీద పాన్ పెట్టి వేడి వేడెక్కాక ఒత్తుకున్న పరాఠాను వేయండి. ఒక వైపు కొద్దిగా కాలిన తర్వాత తిరగేసి స్పూన్ తో నూనె లేదా నెయ్యిని అంచుల వెంబడి వేయండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోండి.

-వేడి వేడి దాల్ పరాఠాలను ప్లేట్‌లోకి తీసుకుని, దానిపై ఒక వెన్న ముద్ద వేసి వడ్డించండి. కమ్మని పెరుగు, నిమ్మకాయ ఊరగాయ లేదా పుదీనా చట్నీతో తింటే అమృతంలా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, January 19, 2026, 6:52 [IST]
Desktop Bottom Promotion