రెస్టారెంట్ స్టైల్ పీతల కూర..ఒక్కసారి రుచి చూస్తే వదలరు..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!

Posted By:

సాధారణంగా నాన్ వెజ్ ప్రియులు ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ లేదా చేపల వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ సీ ఫుడ్ అంటే ఇష్టపడే చాలామందికి మాత్రం పీతల కూర అంటే పంచప్రాణం. పీతల కూర కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పీతలలో ఉండే ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు మిరియాల ఘాటుతో పీతల పులుసు తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. రుచికరమైన, ఆరోగ్యకరమైన పీతల కూరను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Forget Chicken Make This Finger Licking Crab Curry This Weekend

కావలసిన పదార్థాలు
పీతలు - 1 కిలో
చింతపండు -నిమ్మకాయ సైజు
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు
కారం - రుచికి సరిపడా
ధనియాల పొడి - 1 స్పూన్
పసుపు - చిటికెడు
మసాలా దినుసులు: మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర
కొబ్బరి తురుము - అర కప్పు
నూనె - సరిపడా
కరివేపాకు, కొత్తిమీర - గార్నిష్ కోసం
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా పీతలను మార్కెట్ నుండి తెచ్చినప్పుడే ముక్కలుగా చేయించుకోవడం మంచిది. ఇంటికి తెచ్చాక వాటిని పసుపు, ఉప్పు వేసిన నీటిలో 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల నీచు వాసన పోతుంది.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి మిరియాలు, యాలకులు, లవంగాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్‌ లో వేసి, అందులో పచ్చి కొబ్బరి ముక్కలు లేదా తురుము, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో సరిపడా నూనె పోయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, పసుపు వేసి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.

-ఇప్పుడు కడిగి పెట్టుకున్న పీతల ముక్కలను స్టవ్ మీద గిన్నెలో వేసి నూనెలో 3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల పీతలకు మసాలా బాగా పడుతుంది.

-పీతలు కాస్త వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలపాక చింతపండు రసం, కూరకి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి మీడియం మంట మీద 10-15 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో గరిటతో కలపాలి.

-నూనె పైకి తేలి, గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే పీతల కూర రెడీ.

-ఈ వేడి వేడి పీతల కూరను తెల్లటి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Sunday, December 21, 2025, 8:10 [IST]
Desktop Bottom Promotion