బియ్యం అక్కర్లేదు,పిండి పులియబెట్టే పని లేదు..పెసరపప్పుతో 15 నిమిషాల్లో మెత్తటి హెల్తీ ఇడ్లీ..ఎలా చేసుకోవాలంటే

Posted By:

రోజూ పొద్దున్నే ఏ టిఫిన్ రెడీ చేయాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశ కాకుండా ఏదైనా కొత్తగా, ఆరోగ్యకరంగా ప్రయత్నించాలని ఉందా? అయితే బియ్యంతో పనిలేకుండా, కేవలం పెసరపప్పుతో తయారుచేసే అద్భుతమైన ఇడ్లీని మీరు తప్పక రుచి చూడాలి. ఇది మీ రోజూవారీ అల్పాహారానికి ఒక సరికొత్త హంగును జోడించడమే కాకుండా, మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంప్రదాయ ఇడ్లీకి భిన్నంగా, దీని రుచి ప్రత్యేకంగా ఉండి, మిమ్మల్ని మళ్లీ మళ్లీ తినేలా చేస్తుంది. పెసరపప్పు ఇడ్లీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు (పొట్టు లేనిది) - 1 కప్పు
చిక్కటి పెరుగు - అర కప్పు
తురిమిన క్యారెట్ - పావు కప్పు
తురిమిన అల్లం - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
పసుపు - చిటికెడు
ఆవాలు, జీలకర్ర - ఒక టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తాలింపు కోసం
బేకింగ్ సోడా - అర టీస్పూన్

తయారీ విధానం

-ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి రెండు మూడు గంటల పాటు నీటిలో నానబెట్టాలి.

-నానిన పప్పులోని నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్‌ లో వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చుతూ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు గుల్లగా, మెత్తగా వస్తాయి.

-గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు, తురిమిన క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు తాలింపు కోసం చిన్న బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి, ఆ తాలింపును వెంటనే పిండిలో వేసి కలపాలి.

-ఇడ్లీలు పెట్టడానికి ముందు పిండిలో బేకింగ్ సోడా వేసి ఒకే దిశలో నెమ్మదిగా కలపాలి.

-ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండిని నింపి, ఇడ్లీ కుక్కర్‌ లో పెట్టి 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. టూత్‌ పిక్‌ తో గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా వస్తే ఇడ్లీలు ఉడికినట్లే. అంతే వేడివేడి పోషకాల పెసరపప్పు ఇడ్లీ రెడీ.

-మీకు నచ్చిన కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌ తో తింటే ఈ ఇడ్లీ తింటే దాని రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు.

పోషకాల గని
ఈ ఇడ్లీ కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాల గని కూడా. షుగర్ ఉన్నవారికి ఈ ఇడ్లీ బెస్ట్. ఇందులో బియ్యం వాడకం అస్సలు ఉండదు కాబట్టి, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. పెసరపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి, రోజంతా చురుకుగా ఉండటానికి శక్తిని అందిస్తుంది. పెసరపప్పు తేలికగా జీర్ణమవుతుంది కాబట్టి ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా కూడా తీసుకోవచ్చు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

[ of 5 - Users]
Desktop Bottom Promotion