గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే!

Posted By:

దక్షిణ భారతదేశంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీకి ఉన్న స్థానం మరే ఇతర వంటకానికీ లేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు వంటకాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కారానికి, రుచికి గుంటూరు పెట్టింది పేరు.

సాధారణ ఇడ్లీల కంటే భిన్నంగా, చిన్న పరిమాణంలో ఉండే చిట్టి ఇడ్లీలను కమ్మటి నెయ్యి, ఘాటైన గుంటూరు కారం పొడిలో దొర్లించి, పల్లీ చట్నీతో కలిపి తింటే ఆ రుచే వేరు. గుంటూరు స్పెషల్ చిట్టి ఇడ్లీ, కారం పొడి, పల్లీ చట్నీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Guntur Street Style Chitti Idli and Karam Podi Best Breakfast Combo Recipe in Telugu

చిట్టి ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు

మినపగుండ్లు- 1 కప్పు
ఇడ్లీ రవ్వ - 2.5 నుండి 3 కప్పులు
మెంతులు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని

గుంటూరు స్పెషల్ కారం పొడి తయారీకి కావాల్సినవి

గుంటూరు ఎండుమిర్చి - 15 నుండి 20
శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 12
చింతపండు - చిన్న గోలీ పరిమాణంలో
కరివేపాకు - ఒక గుప్పెడు
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

Guntur Street Style Chitti Idli and Karam Podi Best Breakfast Combo Recipe in Telugu

చిట్టి ఇడ్లీ తయారీ విధానం

-ముందుగా మినపగుండ్లను, మెంతులను శుభ్రంగా కడిగి కనీసం 4-5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.

-నానిన మినపప్పును గ్రైండర్ లేదా మిక్సీలో వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ వెన్నలాగా, చాలా మృదువుగా రుబ్బుకోవాలి.

-మరో గిన్నెలో ఇడ్లీ రవ్వను కడిగి, నీళ్లన్నీ గట్టిగా పిండేసి, రుబ్బుకున్న మినప పిండిలో కలపాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి, పిండిని చేతితో బాగా కలపాలి. ఈ పిండిని రాత్రంతా (సుమారు 8-10 గంటలు) వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి. ఉదయానికి పిండి ఉబ్బి, గుల్లగా మారుతుంది.

-చిట్టి ఇడ్లీలు వేయడానికి ప్రత్యేకమైన మినీ ఇడ్లీ ప్లేట్లు మార్కెట్లో దొరుకుతాయి. ఆ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, పులిసిన ఇడ్లీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేయాలి.

-ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పిండి వేసిన ప్లేట్లను అందులో ఉంచి ఆవిరి మీద 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చిట్టి ఇడ్లీ రెడీ.

-గుంటూరు కారం పొడి తయారీ కోసం..స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి, అర టీస్పూన్ నూనె వేసి ముందుగా ఎండుమిర్చిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

-అదే కడాయిలో శనగపప్పు, మినపప్పు వేసి సన్నని మంట మీద ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆపేయాలి.

-వేయించిన దినుసులన్నీ చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన పప్పుల మిశ్రమాన్ని వేసి కాస్త బరకగా (Coarse) మిక్సీ పట్టుకోవాలి. చివరగా పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి అలా తిప్పి ఆపేయాలి. గుమగుమలాడే గుంటూరు ఇడ్లీ కారం పొడి రెడీ.

-ఉడికిన వేడి వేడి చిట్టి ఇడ్లీలను ఒక వెడల్పాటి గిన్నెలో వేయాలి. వాటి పైన నెయ్యిని పోయాలి. ఆ వెంటనే మనం తయారు చేసుకున్న గుంటూరు కారం పొడిని చల్లాలి. ఇడ్లీలకు నెయ్యి, కారం పొడి అంటుకునేలా గిన్నెను పైకి కిందకి ఎగరేస్తూ కలపాలి. కారం, నెయ్యి పట్టిన ఈ ఎర్రటి చిట్టి ఇడ్లీలను పల్లీ చట్నీతో కలిపి తింటే అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Monday, March 16, 2026, 20:55 [IST]
Desktop Bottom Promotion