అమృతంలాంటి దోసకాయ పచ్చడి..ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే లొట్టలేసుకుంటూ తింటారు!

Posted By:

తెలుగు వారి భోజనంలో పచ్చడి లేనిదే ముద్ద దిగదు అని అంటుంటారు. గోంగూర, ఆవకాయ వంటి పచ్చళ్లతో పాటు అప్పటికప్పుడు చేసుకునే రోటి పచ్చళ్లు తెలుగు వంటకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అందులోనూ దోసకాయ పచ్చడికి ఉన్న క్రేజ్ వేరు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే అమృతంలా ఉంటుంది.

కేవలం రుచిలోనే కాదు, దోసకాయలో ఉండే పోషకాలు, నీటి శాతం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎప్పుడూ చేసుకునే పద్ధతిలో కాకుండా సరికొత్త స్టైల్ లో దోసకాయ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthy and Tasty Dosakaya Nuvvula Pachadi Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు
-గట్టి దోసకాయ
-పచ్చిమిర్చి
-ఆయిల్
-జీలకర్ర
-మెంతులు
-ఆవాలు
-కొత్తిమీర
-ఎండుమిర్చి
-వెల్లుల్లి
-తెల్ల నువ్వులు
-ఉప్పు
-పసుపు
-పచ్చి శెనగపప్పు
-ఇంగువ

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి.

-తర్వాత పసుపు రంగులో ఉండే ఒక గట్టి దోసకాయ(సుమారు 400గ్రా)ను పైన తొక్క మొత్తం తీసేసి లోపలి విత్తనాలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసే ముందు విత్తనాలను చేదు ఉన్నాయో లేదో నోట్లో వేసుకొని చూడండి.

-తర్వాత కొత్తిమీర కట్టను కడాలతో సహా కట్ చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత 15 పచ్చిమిరపకాయలను తుంచుకొని పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, అర టీస్పూన్ ఆవాలు వేసి మూడింటిని ఎర్రగా వచ్చేవరకు వేయించాక తుంపుకున్న పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.

-పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి.

-నువ్వులు వేగాక అందులో కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి తక్కవ మంట మీద బాగా వేగనివ్వాలి.

-కొత్తిమీర వేగాక అందులో పావుటీస్పూన్ పసుపు వేసి బాగా కలిపాక ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి.

-చల్లారిన మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే దోసకాయ ముక్కలు వేసి(కొన్ని దోసకాయ ముక్కలు పక్కన పెట్టుకోండి) 4-5 సార్లు పల్స్ ఇస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రోట్లో దంచుకుంటున్నట్లయితే మొత్తం రోట్లో ఒకేసారి వేసి దంచుకోవాలి.

-గ్రైండ్ చేసుకున్న దోసకాయ పచ్చడిని పక్కన ఉంచిన దోసకాయ ముక్కల్లో వేసి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

-తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు(పచ్చి శెనగపప్పు, ఆవాలు,జీలకర్ర)వేసి వేయించేటప్పుడే ఇందులో చిటికెడు ఇంగువ, కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయల ముక్కలు వేసి వేయించాలి.

-వేగిన తాలింపుని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలపండి. అంతే దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, January 19, 2026, 12:11 [IST]
Desktop Bottom Promotion