చిన్నారుల ఫేవరెట్‌.. లంచ్‌ బాక్స్‌లోకి అదిరిపోయే రసం రైస్‌.. కొత్తగా ఇలా చేయండి.!

తెలుగు వంటకాల్లో ప్రసిద్ధి చెందింది పప్పు. చాలా సులభంగా అయిపోవడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి తక్షణ శక్తిని అందించి రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. ఇక చిన్నపిల్లలు అయితే ప్రతి రోజూ పప్పు అన్నం పెట్టినా వద్దు అనకుండా కమ్మగా తినేస్తారు. రుచికి రుచితో పాటు త్వరగా అరిగిపోవడంతో జీర్ణక్రియపై ప్రభావం పడదు. ఇక పప్పుతో చాలా రకాల వెరైటీలు చేస్తుంటాం. అందులో రసం రైస్‌ ఒకటి. ఆ రసం రైస్‌ను సింపుల్‌గా, టేస్టీగా, కొత్తగా ఎలా చేసుకోవాలో చూద్దాం..

Healthy one pot rasam rice for kids lunch box protein rich and best for muscle strength

పిల్లలకు స్కూళ్లు మొదలయ్యాక లంచ్‌ బాక్స్‌ లేదా సాయంత్రం ఇంటికి రాగానే నోటికి రుచిగా, ఆకలి కమ్మగా తీరేలా ఏదైనా కొత్తగా చేయమని అడుగుతుంటారు. ఈ క్రమంలో వారికి ఇలా రసం రైస్‌ చేసి చూడండి. లొట్టలేసుకుంటూ తినడమే కాదు.. పిల్లల శరీరానికి కావాల్సిన పోషకాలు సైతం పుష్కలంగా అంది వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడేలా చేస్తుంది.

రసం రైస్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం- ముప్పావు కప్పు
కందిపప్పు- అరకప్పు
నూనె- 3 టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర- అర టీస్పూన్‌
ఆవాలు- అర టీస్పూన్‌
ఎండు మిర్చి- మూడు
పచ్చిమిర్చి- ఐదు
కరివేపాకు- కొద్దిగా
ఇంగువ- కొద్దిగా
వెల్లుల్లి- 12 రెబ్బలు
టమాటా- నాలుగు
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- పావు టీస్పూన్‌
కారం- టీస్పూన్‌
చింతపండు- నిమ్మకాయ సైజు
నీళ్లు- ఐదు గ్లాసులు
బెల్లం- చిన్న ముక్క
మిరియాల పొడి- టీస్పూన్‌
రసం పౌడర్‌- టీస్పూన్‌

రసం రైస్‌ తయారీ విధానం

రసం రైస్‌ తయారీ కోసం ముందుగా బియ్యం, కందిపప్పు కలిపి ఒకే గిన్నెలో వేసి రెండు సార్లు కడిగి 30 నిమిషాల పాటు నాననివ్వండి. అదేవిధంగా మరో చిన్న గిన్నెలో చింతపండును కడిగి నానబెట్టుకోండి.

ఇప్పుడు స్టవ్‌పైన కుక్కర్‌ పెట్టుకుని నూనె పోసుకోవాలి. వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. టమాటా మగ్గుతుండగా ఇంగువ, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.

అన్నీ వేగిన తర్వాత అందులో చింతపండు రసం వేసి మగ్గనివ్వాలి. చింతపండు రసం దగ్గరికి అయిన తర్వాత ఐదు గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు అందులో కారం, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు, రసం పౌడర్‌ వేసి మరి కాసేపు మరగనివ్వాలి.

నీళ్లు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం, కందిపప్పు మిశ్రమం వేసి కలిపి కుక్కర్‌ మూత పెట్టాలి. నాలుగు లేదా ఐదు విజిల్స్‌ వచ్చేవరకు స్టవ్‌ పైన ఉంచాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి పై నుంచి కొత్తిమీర చల్లి దించుకోవడమే. టేస్టీ టేస్టీ రసం రైస్‌ రెడీ. అప్పడాలతో నంజుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

ఈ రసం రైస్‌ను వేడిగా ఉన్నప్పుడే తినడం ద్వారా ఎక్కువ రుచికరంగా ఉంటుంది. చల్లగా అయినట్లయితే రసం రైస్‌ గట్టిపడి రుచిని కోల్పోతుంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలకు ఇది మంచి పోషకాహారం. మిరియాల పొడి కలపడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కందిపప్పులోని ప్రొటీన్‌ పుష్కలంగా అందుతుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 14, 2026, 20:35 [IST]
Desktop Bottom Promotion