తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే

Posted By:

ఉగాది నుంచి ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల పండుగను చైత్ర నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు అని అంటారు. పవిత్రమైన నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది మార్చి 19 నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారు.

ఉపవాస సమయంలో నీరసం రాకుండా ఉండాలంటే ఆరోగ్యంతో పాటు రుచి కూడా అవసరం. అందుకోసం తక్కువ నూనెతో తయారయ్యే సగ్గుబియ్యం దోశ బెస్ట్ ఆప్షన్. ఇది తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది.

Healthy Tasty and Fasting Friendly How to Make the Perfect Sabudana Dosa Recipe in Telugu

సగ్గుబియ్యం దోశ తయారీకి కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం - 1 కప్పు
సామ బియ్యం (ఉపవాస బియ్యం) - 1 కప్పు
తాజా పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
టమాటో - 1
పచ్చి బంగాళదుంపలు - 2
అల్లం తరుగు - కొద్దిగా
ఉపవాసపు ఉప్పు- రుచికి సరిపడా
నెయ్యి లేదా వంటనూనె - కాల్చుకోవడానికి

సగ్గుబియ్యం దోశ తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అందులో సగ్గుబియ్యం మునిగేలా నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టాలి. అలాగే మరో గిన్నెలో సామ బియ్యాన్ని కూడా తీసుకుని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. సమయం పూర్తయ్యాక బియ్యం నీటిని పీల్చుకోగా మిగిలిన అదనపు నీటిని వంచేయాలి.

-ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్‌ లో వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన సామ బియ్యాన్ని కూడా మిక్సీలో వేసి, అందులో 2-3 టేబుల్ స్పూన్ల తాజా పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పిండి మిశ్రమాలను ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి.

-పిండి మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుతూ, మన దోశ పిండి లాగా సరైన మోతాదులో పల్చని పేస్ట్‌ లా కలుపుకోవాలి.

-సిద్ధంగా ఉన్న పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో ముక్కలు, ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి బంగాళదుంపలు వేయాలి. అలాగే రుచి కోసం కొద్దిగా అల్లం తరుగు, ఉపవాసానికి వాడే రాక్ సాల్ట్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి.

-స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేయాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసి, మంటను తక్కువగా ఉంచాలి. గరిటెతో పిండిని తీసుకుని దోశలాగా మరీ పల్చగా కాకుండా, కొంచెం మందంగా పోయాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత, నెమ్మదిగా తిప్పుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మంటను కాస్త పెంచి, అట్లకాడతో మెల్లగా నొక్కుతూ క్రిస్పీగా కాల్చుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, కమ్మటి సగ్గుబియ్యం దోవ రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ చీలాను తాజా పెరుగుతో గానీ, ఉపవాసంలో తినగలిగే పల్లీల చట్నీతో గానీ తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Wednesday, March 18, 2026, 22:27 [IST]
Desktop Bottom Promotion