మండే ఎండలో ఈ షర్బత్ తాగితే చిటికెలో బాడీ కూల్ అయిపోతుంది, రంజాన్ స్పెషల్ కూడా.. ఎలా చేసుకోవాలంటే

రంజాన్ మాసం చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రంజాన్ మాసం ముగిసిపోతుంది. మార్చి 31వ తేదీన రంజాన్ పండగ తరువాత ఈ మాసం గుడ్ బాయ్ చెప్పనుంది. అయితే ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఎండ వేడిమి తాళలేక రకరకాల పానీయాలు తయారు చేసుకోవడం, బయట తాగడం వంటివి చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రంజాన్ పండగ కొనసాగుతున్న నేపథ్యంలో సమ్మర్​ ప్రత్యేకమైన చల్లని, రిఫ్రెషింగ్ షర్బత్ తాగితే ఆ రుచి, ఆ చల్లదనం అద్భుతంగా ఉంటుంది. అలాగే సమ్మర్‌లో తాగడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అంట కూడా. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే మీ ఇంటి సభ్యులు సమ్మర్ మజా అనుభవించవచ్చు. అయితే, దీనిని తయారుచేయడానికి అవసరమైన పదార్థాలు మరియు తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

షర్బత్ తయారీకి కావలసిన పదార్థాలు:

పంచదార - 1 కప్పు
నీళ్లు - పావు కప్పు
పాలు - 4 కప్పులు
కస్టర్డ్ పొడి - 1 టేబుల్ స్పూన్
పాలు (కస్టర్డ్ కోసం) - 2 టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - అర టీస్పూన్
యాలకుల పొడి - 1 టీస్పూన్
చియా సీడ్స్ - 1 టేబుల్ స్పూన్
బాదం, పిస్తా పలుకులు - 2 టేబుల్ స్పూన్లు

రంజాన్ షర్బత్ తయారీ విధానం:

రంజాన్ షర్బత్ తయారు చేసుకోవడానికి మొదటగా స్టవ్‌పై పాన్ పెట్టి అందులో పంచదారను వేసి, సిమ్ మంట మీద కరిగేలా బాగా కలపాలి. పంచదార కరిగి అందులో పొంగుల ద్వారా రంగు మారినప్పుడు, దానిలో పావు కప్పు నీళ్లు జోడించాలి. నీళ్లు వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉంచాలి. అలానే కలుపుతూ బాగా ఉడికించుకోవాలి.

ఇప్పుడు మంటను సిమ్‌లో ఉంచి, పంచదార కరిగిపోయే వరకు.. ఒక గిన్నెలో కుంకుమ పువ్వును నానబెట్టుకోవాలి. ఆ తరువాత, పాలు కూడా ఈ మిశ్రమంలో జోడించి బాగా కలపాలి. పాలు మరియు పంచదార చక్కగా కలిసిపోయేలా 4-5 నిమిషాలు ఉడికించాలి.

Take a Poll

ఈ సమయంలో, ఒక చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకుని, 2 టేబుల్ స్పూన్ల పాలు వేసి కరిగించాలి. ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని స్టవ్‌పై ఉడికే మిశ్రమంలో జోడించి, గట్టిగా కలుపుతుండాలి. ఈ మిశ్రమం తయారు చేస్తున్న సమయంలో ఎటువంటి గడ్డలు రాకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి.

ఇప్పుడు కుంకుమ పువ్వును మరియు యాలకుల పొడిని కూడా ఈ మిశ్రమంలో జోడించి, ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలో తీసుకొని, రూమ్ టెంపరేచర్‌కి రానివ్వాలి. ఆ తరువాత 2 గంటలు ఫ్రిడ్జ్‌లో వుంచాలి.

ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత, చియా సీడ్స్ లేదా బేసిల్ సీడ్స్‌ని నీటిలో నానబెట్టుకుని, షర్బత్‌లో జోడించి బాగా కలపాలి. చివరగా, బాదం మరియు పిస్తా పలుకులతో గార్నిష్ చేసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చల్లని, టేస్టీ దూద్ షర్బత్‌ను రంజాన్ పండుగ సమయంలో కానీ, సమ్మర్‌ లోనూ చాలా సులభంగా, తక్కువ సమయంలోనే రెడీ చేసుకొని ఆస్వాదించొచ్చు.

[ of 5 - Users]
Story first published: Thursday, March 27, 2025, 14:30 [IST]
Desktop Bottom Promotion