కనుమ రోజున కిర్రాక్ మటన్ దమ్ బిర్యానీ..ఇలా చేసుకోండి

Posted By:

హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ పేరు వింటేనే చాలామందికి నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి. ఒక్కసారి దీని టేస్ట్ చూసినోళ్లు జీవితాంతం ఆ రుచిని గుర్తుపెట్టుకుంటారు. దీని రుచి, సువాసన ప్రత్యేకంగా ఉంటాయి. దమ్ పద్ధతిలో వండటం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ కోసం రెస్టారెంట్ కి వెళ్లనక్కర్లేదు..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కనుమ పండుగ రోజు హైదరాబాదీ స్టైల్ లో మటన్ దమ్ బిర్యానీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మటన్- 1 కేజీ
-బాస్మతి బియ్యం -1 కేజీ
-గట్టి పెరుగు - 1 కప్పు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-గరం మసాలా
-ఉప్పు
-నిమ్మ రసం
-పచ్చి బొప్పాయి పేస్ట్
-కొత్తిమీర
-పుదీనా
-ఉప్పు
-షాజీరా
-లవంగాలు
-యాలకులు
-దాల్చిన చెక్క
-బిర్యానీ ఆకులు
-నెయ్యి
-నూనె
-ఉల్లిపాయలు
-కుంకుమ పువ్వు

హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ తయారీ విధానం

-ముందుగా మటన్ ని మ్యారినేట్ చేయాలి. ఇందుకోసం ఒక గిన్నెలో మీడియం సైజులో కట్ చేసిన 1 కేజీ మటన్ ముక్కలు, 1 కప్పు గట్టి పెరుగు,2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బొప్పాయి పేస్ట్ , కొత్తిమీర తరుగు కొంచెం, పుదీనా తరుగు కొంచెం వేసి బాగా కలిపి కనీసం 2 గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి.

-తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి మరిగించాలి. అందులో 2 బిర్యానీ ఆకులు, 4 యాలకలు, 4 లవంగాలు, ఉప్పు, 1 టీస్పూన్ షాజీరా, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి కలపిన తర్వాత అరగంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి 70 శాతం వరకు ఉడికించాలి. బియ్యం మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. నీటిని వడగట్టి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక మందపాటి అడుగు గల గిన్నె లేదా హండీ తీసుకొని అడుగున 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలను ఒక లేయర్‌గా పరచాలి. దానిపై సగం ఉడికించిన బియ్యంలో సగం వేసి ఒక లేయర్‌గా పరచాలి. దానిపై వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కుంకుమపువ్వు కలిపిన పాలు, కావాలనుకుంటే ఫుడ్ కలర్ చల్లుకోవాలి. మళ్ళీ మిగిలిన మటన్, బియ్యంతో ఇదే విధంగా లేయర్స్ వేయాలి. చివరగా నెయ్యి వేసి మూత పెట్టాలి.

-గిన్నె మూతను చపాతీ పిండితో సీల్ చేయాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టి వేడి చేయాలి. దానిపై బిర్యానీ గిన్నెను పెట్టి తక్కువ మంట మీద 45-60 నిమిషాలు దమ్ చేయాలి. దమ్ చేసే సమయంలో గిన్నె అడుగు భాగం మాడకుండా జాగ్రత్త పడాలి.

-దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మూత తీసి బిర్యానీని మెల్లగా కలపాలి. వేడి వేడి హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. దీనిని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ యమాగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, January 10, 2025, 16:52 [IST]
Desktop Bottom Promotion