కనుమ స్పెషల్..తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు..రుచి మామూలుగా ఉండదు

Posted By:

కనుమ పండుగ అంటేనే ఒక ప్రత్యేకమైన సందడి. సంక్రాంతి మూడు రోజుల పండుగలో, భోగి, సంక్రాంతి రోజుల్లో పిండివంటలు, శాఖాహార భోజనాలతో గడిపిన తర్వాత కనుమ రోజున మాత్రం ప్రతి ఇంట్లో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే.

అందులోనూ నాటుకోడి పులుసుకు ఉండే క్రేజ్ వేరు. తెలంగాణ వారి ఘాటు మసాలాలతో చేసే ఈ పులుసు, చలికాలంలో వచ్చే కనుమ పండుగకు సరైన వంటకం. కనుమ పండుగ సందర్భంగా, అచ్చమైన తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Kanuma Special Authentic Telangana Style Natu Kodi Pulusu Recipe in Telugu

కావలసిన పదార్థాలు
నాటుకోడి మాంసం: 1 కిలో (చర్మంతో సహా ఉంటే బాగుంటుంది)
ఉల్లిపాయలు: 3 పెద్దవి
పచ్చిమిర్చి: 4-5
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
కారం: 3-4 టేబుల్ స్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
ధనియాల పొడి: 2 టేబుల్ స్పూన్లు
నూనె: 4-5 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: ఒక చిన్న కట్ట
పుదీనా: గుప్పెడు
కరివేపాకు: 2 రెమ్మలు
ఎండు కొబ్బరి ముక్కలు: చిన్న కప్పు
గసగసాలు: 1 టేబుల్ స్పూన్
లవంగాలు: 4-5
యాలకులు: 2
దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క

Kanuma Special Authentic Telangana Style Natu Kodi Pulusu Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా నాటుకోడి మాంసాన్ని బాగా కడగాలి. నాటుకోడి నీచు వాసన రాకుండా ఉండాలంటే కడిగిన ముక్కలకు కొంచెం పసుపు, ఉప్పు రాసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ లేదా పెనం పెట్టి అందులో ఎండు కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగం, యాలకులు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

-వేయించినవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టుకోవాలి. గిన్నెలో నూనె పోసి వేడెక్కాక అందులో షాజీరా, బిర్యానీ ఆకు వేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.

-ఉల్లిపాయలు వేగగానే తాజాగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. పుదీనా ఆకులు కూడా ఇప్పుడే వేస్తే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది.

-ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను గిన్నెలో వేయాలి. నూనెలో ముక్కలు బాగా కలిసేలా తిప్పాలి. మూత పెట్టి మీడియం మంటపై ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల చికెన్‌ లోని నీరు బయటకు వస్తుంది.

-నీరు కాస్త ఇంకిన తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టేలా మరో 5 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి.

ఇ-ప్పుడు ముక్కలు మునిగేంత వరకు సుమారు 2-3 గ్లాసుల నీళ్లు పోయాలి. కుక్కర్ అయితే 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. గిన్నెలో అయితే ముక్క మెత్తబడే వరకు దాదాపు 30-45 నిమిషాలు ఉడికించాలి.

-ముక్క 80శాతం ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి-గసగసాల పేస్ట్, ధనియాల పొడి వేసి కలపాలి. గ్రేవీ చిక్కబడే వరకు సన్నని మంటపై ఉడికించాలి. ఈ దశలో కూర నుంచి నూనె పైకి తేలడం గమనించవచ్చు.

-చివరగా కొద్దిగా గరం మసాలా పొడి చల్లి, సన్నగా తరిగిన కొత్తిమీరను జల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.

-అంతే ఘాటైన, రుచికరమైన తెలంగాణ నాటుకోడి పులుసు రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, January 16, 2026, 9:00 [IST]
Desktop Bottom Promotion