మల్లెపూలలా మెత్తగా..రెస్టారెంట్ స్టైల్ ఖుష్బూ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సౌతిండియా బ్రేక్ ఫాస్ట్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది ఇడ్లీ. నూనె వాడకుండా, ఆవిరిపై ఉడికించడం వల్ల ఇది అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రసిద్ధి చెందింది. ఫైబర్ అధికంగా ఉండే ఇడ్లీని సాంబార్ లేదా రుచికరమైన చట్నీతో కలిపి తింటే ఆ అనుభూతే వేరు. సాధారణంగా మనం ఇళ్లలో బియ్యం, మినపప్పు నానబెట్టి, రుబ్బి, పులియబెట్టి ఇడ్లీలు తయారు చేస్తూ ఉంటాము.

అయితే మనం అప్పుడప్పుడు హోటళ్లలో తినే కొన్ని రకాల ఇడ్లీలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. తట్టె ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, వెజిటబుల్ ఇడ్లీ వంటివి ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో ఖుష్బూ ఇడ్లీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో మృదువుగా, తెల్లగా, చూడటానికి అందంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ ఖుష్బూ ఇడ్లీలను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చూడండి.

Khushboo Idli Secret Get Hotel Style Softness at Home Recipe in Telugu

ఖుష్బూ ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు

ఇడ్లీ బియ్యం లేదా రేషన్ బియ్యం- 3 కప్పులు
పొట్టు లేని మినపప్పు- అర కప్పు
సగ్గుబియ్యం- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి

ఖుష్బూ ఇడ్లీ తయారీ విధానం

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మూడు కప్పుల బియ్యం, అర కప్పు మినపప్పు, రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేయండి. వీటన్నింటినీ నీటితో శుభ్రంగా మూడు లేదా నాలుగు సార్లు కడగాలి. ఆ తర్వాత గిన్నెలో మంచి నీరు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యం చేర్చడం వల్ల ఇడ్లీలకు అదనపు మృదుత్వం వస్తుంది.

ఆరు గంటల తర్వాత నానబెట్టిన పప్పు, బియ్యంలోని నీటిని వంపేసి వాటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ పిండి మరీ పలుచగా కాకుండా దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

Khushboo Idli Secret Get Hotel Style Softness at Home Recipe in Telugu

గ్రైండ్ చేసిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని చేతితో ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి, బాగా పులిసి ఇడ్లీలు మృదువుగా వస్తాయి.

ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి రాత్రంతా (కనీసం 8 నుండి 10 గంటలు) వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం చూస్తే పిండి చక్కగా పులిసి పరిమాణంలో రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఆ పిండిని గరిటెతో మెల్లగా కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలపాలి.

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాయాలి. ఇడ్లీ కుక్కర్‌ లో కొద్దిగా నీళ్లు పోసి, ప్లేట్లను అందులో పెట్టి రెండు నిమిషాలు వేడి చేయాలి. తర్వాత మూత తీసి ప్లేట్లలోని గుంతలలో మూడు వంతుల వరకు ఇడ్లీ పిండిని నింపాలి.

పిండిని నింపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీలు గట్టిపడతాయి. పది నిమిషాల తర్వాత మంట ఆపి, వెంటనే కాకుండా ఒకటి రెండు నిమిషాలు ఆగి మూత తీయాలి. ఇప్పుడు ఒక చెంచాతో ఇడ్లీలను తీస్తే, అవి అంటుకోకుండా సులభంగా వస్తాయి.

అంతే వేడివేడిగా, మల్లెపూలలాంటి మృదువైన ఖుష్బూ ఇడ్లీలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 30, 2025, 9:00 [IST]
Desktop Bottom Promotion