Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు..ఇవి పెడితే అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడు!
వినాయకచవితి వచ్చిందంటే చాలు తెలుగునాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ పండుగ శోభను సంతరించుకుంటుంది. మట్టి గణపతిని ప్రతిష్ఠించి, పత్రితో పూజించి, ఆ విఘ్ననాయకుడి అనుగ్రహం కోసం ఎదురుచూడని హిందువులు ఉండరు. అనేక ఇతర మతాల వ్యక్తులు కూడా వినాయకచవితిని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయకచవితి పండుగను ఆగస్టు 27న జరుపుకుంటారు.వినాయకచవితి రోజున ప్రథమ పూజ్యుడైన ఆ గణనాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజ ఎంత ముఖ్యమో, ఆయనకు ప్రేమతో సమర్పించే నైవేద్యం కూడా అంతే ముఖ్యం.
మన భక్తిని, ప్రేమను రుచికరమైన వంటకాల రూపంలో స్వామికి అర్పించడమే నైవేద్యం వెనుక ఉన్న ఆంతర్యం. పురాణాల ప్రకారం వినాయక చవితినాడు స్వామికి తొమ్మిది రకాల ప్రసాదాలను సమర్పించడం అత్యంత శ్రేష్ఠమని పండితులు చెబుతారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయాలను బట్టి విభిన్నమైన వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కొన్ని నైవేద్యాలు మాత్రం దేశవ్యాప్తంగా గణపతికి అత్యంత ఇష్టమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రసాదాలు లేనిదే వినాయక చవితి పూజ సంపూర్ణం కాదు. మరి ఆ లంబోదరుడి మనసు దోచిన ఆ మధురమైన వంటకాలేంటో ఇక్కడ చూడండి.
మోదకాలు (కుడుములు)-జ్ఞాన ఫలానికి ప్రతీక
వినాయకుడి నైవేద్యం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మోదకం. దీనినే కుడుము అని కూడా పిలుస్తారు. ఆవిరిపై ఉడికించిన బియ్యంపిండి ఉండ లోపల, తియ్యటి బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల సువాసనతో నిండిన పూర్ణం.. ఆహా, తలచుకుంటేనే నోరూరుతుంది. ఈ మోదకం కేవలం ఒక పిండివంట మాత్రమే కాదు.. జ్ఞానానికి ప్రతీక అని చెబుతారు. అందుకే దేశంలో ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలలో ఆయన ఒక చేతిలో మోదకాన్ని పట్టుకుని కనిపిస్తారు. మోదకం అంటే స్వామికి ఎంత ఇష్టమంటే అది లేనిదే ఆయన పూజ పూర్తికాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.
పూర్ణం బూరెలు-శుభానికి సంకేతం
మోదకాల తర్వాత గజాననుడి మనసు దోచిన మరో అద్భుతమైన వంటకం పూర్ణం
బూరెలు. ఈ వంటకాన్ని వినాయక చవితికే కాకుండా, గణపతి పూజతో ప్రారంభించే
ప్రతి శుభకార్యంలోనూ తప్పనిసరిగా నైవేద్యంగా పెడతారు. శనగపప్పు,
బెల్లంతో చేసిన తియ్యటి పూర్ణాన్ని, బియ్యంపిండితో చేసిన తోపులో
ముంచి,నూనెలో బంగారు వర్ణం వచ్చేవరకు వేయిస్తారు. ఈ బూరెలను స్వామికి
సమర్పిస్తే ఇంట్లో శుభాలు కలుగుతాయని, ప్రారంభించిన పనులు
నిర్విఘ్నంగా పూర్తవుతాయని నమ్ముతారు.
లడ్డూలు-సిరిసంపదలకు చిహ్నం
లంబోదరుడికి లడ్డూలంటే ఎనలేని ప్రేమ. శెనగపిండి, నెయ్యి, బెల్లం లేదా
చక్కెర పాకంతో చేసే ఈ లడ్డూలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.
ముఖ్యంగా మహారాష్ట్రలో మోతీచూర్ లడ్డూలను స్వామికి సమర్పించడం
ఆనవాయితీ. గణపతికి లడ్డూలను నైవేద్యంగా పెడితే ఇంట్లో సిరిసంపదలు
వృద్ధి చెందుతాయని, ఐశ్వర్యం వెల్లివిరుస్తుందని ఉత్తరాది భక్తులు
గట్టిగా నమ్ముతారు. పూజ అనంతరం ఈ లడ్డూలను ఇరుగుపొరుగుకు పంచడం వల్ల
అరిష్టాలు తొలగిపోతాయని వారి విశ్వాసం.
అటుకుల పాయసం-భక్తికి కొలమానం
వినాయకుడికి అటుకులంటే అమితమైన ఇష్టం. దీని వెనుక ఒక కథ ప్రచారంలో
ఉంది. ఒకప్పుడు ధనానికి అధిపతి అయిన కుబేరుడు తన ఐశ్వర్యాన్ని
ప్రదర్శించాలనే ఉద్దేశంతో వినాయకుడిని విందుకు ఆహ్వానించాడట. ఎన్ని
రకాల పిండివంటలు వడ్డించినా ఆ బొజ్జ గణపయ్య ఆకలి తీరలేదు. అప్పుడు
కైలాసంలో ఉన్న పార్వతీదేవి, భక్తితో ప్రేమగా అటుకులను పంపగా, వాటిని
తిన్న వెంటనే స్వామి ఆకలి తీరి, త్రేన్పులతో సంతృప్తి చెందాడట. ఈ కథ
భక్తి గొప్పతనాన్ని చెబుతుంది. అందుకే భక్తితో కాసిన్ని అటుకులను
పాయసంగా చేసి పెట్టినా స్వామి స్వీకరించి అనుగ్రహిస్తాడని భక్తులు
నమ్ముతారు.
అరటి పండ్లు-ఆరోగ్య ప్రదాయిని
గజ ముఖుడైన గణపతికి గజాలకు అంటే ఏనుగులకు అత్యంత ఇష్టమైన అరటిపండ్లంటే
చెప్పలేనంత ప్రీతి. అనేక ప్రాంతాల్లో ఇతర నైవేద్యాలు సమర్పించే ముందు
తొలి నైవేద్యంగా అరటి పండ్లనే అర్పిస్తారు. సులువుగా లభించే ఈ పండ్లను
భక్తితో సమర్పిస్తే చాలు స్వామి సంతృప్తి చెంది ఆరోగ్యాన్ని,
ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.
ఇతర ఇష్టమైనవి
పెరుగు, చక్కెర, డ్రై ఫ్రూట్స్ కలిపి చేసే శ్రీఖండ్, మన తెలుగువారి
ఇళ్లలో ప్రత్యేకంగా చేసుకునే కరకరలాడే గారెలు, తియ్యటి పాయసం అన్నా
గణపతికి ఎంతో ఇష్టం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













