నోటికి స్వర్గం చూపించే మధురై స్పెషల్ మటన్ కోతు కర్రీ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సౌత్ ఇండియా సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన మధురై కేవలం మీనాక్షి అమ్మవారి ఆలయానికే కాదు, నోరూరించే అద్భుతమైన వంటకాలకు కూడా ప్రసిద్ధి. మధురై వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నదే మటన్ కోతు కర్రీ. కోతు అంటే తమిళంలో కొట్టడం లేదా చిన్న ముక్కలుగా నరకడం అని అర్థం.

ఈ కూర అన్నం, చపాతీ, పరోటా, ఇడ్లీ, దోశ దేనితో తిన్నా అమోఘంగా ఉంటుంది. మధురై స్పెషల్ మటన్ కోతు కూర మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

బోన్‌ లెస్ మటన్ - 500 గ్రాములు
పసుపు -అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
పచ్చి కొబ్బరి తురుము-అర కప్పు
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 6
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
లవంగాలు - 4
యాలకులు - 2
గసగసాలు - 1 టీస్పూన్
కల్పాసి - చిన్న ముక్క
నూనె లేదా నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
సాంబార్ ఉల్లిపాయలు - 15-20
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2
టమాటాలు - 2
పసుపు -పావు టీస్పూన్
కారం - 1 టీస్పూన్
కొత్తిమీర - గుప్పెడు
నిమ్మరసం - 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా చిన్న చిన్నవిగా కట్ చేసిన మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్‌ లో వేయండి.

మటన్ ముక్కల్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మటన్ మునిగే వరకు నీళ్లు పోసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 5-6 విజిల్స్ వచ్చేవరకు లేదా మటన్ మెత్తగా ఉడికే వరకు ఉంచండి. మటన్ ఉడికిన తర్వాత, స్టాక్ (ఉడికించిన నీళ్లు) తో పాటు పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కల్పాసి వేసి చిన్న మంట మీద సువాసన వచ్చేవరకు దోరగా వేయించాలి. ఇప్పుడు గసగసాలు వేసి మరో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి పాన్ వేడికే ఒకసారి కలిపి చల్లారనివ్వాలి.

ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక లోతైన కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత సోంపు, కరివేపాకు వేసి వేయించండి.
ఇప్పుడు సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.

తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు తరిగిన టమాటాలు, పచ్చిమిర్చి వేసి, టమాటాలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, కారం వేసి ఒక నిమిషం పాటు వేయించండి.

ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ వేసి నూనె పైకి తేలే వరకు (సుమారు 5-7 నిమిషాలు) చిన్న మంట మీద బాగా వేయించాలి.

మసాలా బాగా వేగిన తర్వాత, ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను దాని స్టాక్‌ తో సహా పాన్‌ లో వేయండి. రుచికి సరిపడా ఉప్పు చూసుకుని మూత పెట్టి చిన్న మంట మీద 10-15 నిమిషాల పాటు ఉడికించండి. మసాలాలన్నీ మటన్‌ కు బాగా పట్టి, కూర చిక్కగా అయ్యే వరకు ఉంచాలి.

చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, కావాలనుకుంటే ఒక టీస్పూన్ నిమ్మరసం పిండి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే మటన్ కోతు కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 28, 2025, 12:56 [IST]
Desktop Bottom Promotion