ఒక్కసారి ఈ చట్నీ చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, దోశ,చపాతీ దేనిలోకైనా సూపర్‌

Posted By:

ఇడ్లీ, దోస, చపాతీ.. ఇలా ఏ టిఫిన్ అయినా అందులోకి నంజుకునే పచ్చడి రుచిగా ఉంటేనే ఆ రోజు ఉదయం ఉత్సాహంగా మొదలవుతుంది. కానీ రోజూ అవే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీలు తిని తిని పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ బోర్ కొట్టేస్తుంది. ఎంత బాగా చేసినా, రొటీన్ రుచుల వల్ల ఆసక్తి తగ్గిపోతుంది.

బోరింగ్ బ్రేక్‌ ఫాస్ట్‌ ను ఒక్కసారిగా స్పైసీగా మార్చేసే రాజస్థానీ వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి. సాధారణంగా మనం చేసుకునే కారం చట్నీల కంటే ఇది చాలా భిన్నంగా, అద్భుతమైన రుచితో ఉంటుంది. రాజస్థానీ వెల్లుల్లి చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Make It Once Store for a Month The Perfect Spicy Garlic Chutney Recipe in Telugu

కావలసిన పదార్థాలు
ఎండు మిరపకాయలు - 10-12
వెల్లుల్లి గడ్డలు - 2
అల్లం - 2 అంగుళాల ముక్క
నీరు - పావు కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
నువ్వుల నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

-ముందుగా ఎండు మిరపకాయలను వేడి నీటిలో సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి. మీరు కారం తక్కువగా తినేవారైతే, మిరపకాయల లోపల ఉండే గింజలను తీసివేసి నానబెట్టుకోవచ్చు. దీనివల్ల రంగు బాగుంటుంది కానీ ఘాటు తగ్గుతుంది.

-మిరపకాయలు మెత్తగా నానిన తర్వాత, వాటిని నీటి నుండి బయటకు తీయండి. నానబెట్టిన నీటిని పారబోయకుండా పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టిన మిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేయాలి. అవసరమైతే పక్కన పెట్టిన మిరపకాయల నీటిని కొద్దిగా పోస్తూ, మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే చట్నీ అంత రుచిగా ఉంటుంది.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నువ్వుల నూనె పోసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక జీలకర్ర వేసి, చిటపటలాడే వరకు వేయించాలి. రాజస్థానీ వంటకాల్లో నువ్వుల నూనె వాడటం వల్ల చట్నీకి మంచి సువాసన వస్తుంది.

-జీలకర్ర వేగిన తర్వాత, సిద్ధం చేసుకున్న మిరప-వెల్లుల్లి పేస్ట్‌ ను నూనెలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మంటను తక్కువ నుండి మీడియంలో ఉంచి కలపాలి.

-ఇప్పుడు పాన్ మీద మూత పెట్టి సుమారు 10-15 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. చట్నీలోని పచ్చి వాసన పోయి, నూనె మిశ్రమం నుండి వేరుపడి పైకి తేలేంత వరకు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి, చట్నీని పూర్తిగా చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. ఈ నిమ్మరసం చట్నీకి మంచి పుల్లని రుచిని ఇవ్వడమే కాకుండా, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన రాజస్థానీ వెల్లుల్లి చట్నీ రెడీ.

-ఈ చట్నీని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిచి ఫ్రిజ్‌ లో ఉంచితే దాదాపు నెల రోజుల పాటు తాజాగానే ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, December 16, 2025, 8:55 [IST]
Desktop Bottom Promotion