ఉల్లి,వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచి..ఈ కొత్తిమీర చట్నీతో ఇడ్లీలు ఎన్నైనా తినేయొచ్చు

Posted By:

భారతీయ వంటగదిలో కొత్తిమీరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం వంటలకు సువాసనను లేదా అలంకరణను ఇచ్చే ఆకు మాత్రమే కాదు ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. సాధారణంగా మన ఇళ్లలో చట్నీలు చేసేటప్పుడు రుచి కోసం ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడుతుంటాం.

కానీ ఉల్లి, వెల్లుల్లి లేకుండా కొత్తిమీర చట్నీ తయారుచేసుకోవచ్చు. ఈ చట్నీతో ఇడ్లీ తింటుంటే ఎన్నైనా పోతూ ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి లేని ఈ చట్నీ తేలికగా జీర్ణమవుతుంది, కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు కూడా నిశ్చింతగా తినవచ్చు.

No Onion No Garlic No Problem Try This Delicious Coriander Chutney Ultimate Side Dish for Idli and Dosa

కావలసిన పదార్థాలు
కొత్తిమీర: 2 పెద్ద కట్టలు
పచ్చిమిర్చి: 6-8
మినప్పప్పు: 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టీ స్పూన్
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు
బెల్లం: చిన్న ముక్క
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
ఇంగువ: చిటికెడు
నూనె: 1 టీ స్పూన్
ఆవాలు: అర టీ స్పూన్
జీలకర్ర: అర టీ స్పూన్
ఎండుమిర్చి: 1
కరివేపాకు: 1 రెమ్మ

తయారీ విధానం

-ముందుగా కొత్తిమీరను వేర్ల నుండి వేరు చేసి కాడలతో సహా తీసుకోవాలి. దీనిని నీటిలో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీరు ఆరేలా పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని తొడిమలు తీసి పెట్టుకోండి.

-స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. పప్పులు బంగారు రంగులోకి మారుతున్నప్పుడు జీలకర్ర వేసి, ఆ వెంటనే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి తెల్లగా మారాక, వీటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

-అదే బాండీలో మరో స్పూన్ నూనె వేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను వేయాలి. దీనితో పాటే చింతపండును కూడా వేయండి. కొత్తిమీరను మరీ ఎక్కువగా వేయించకూడదు. పచ్చి వాసన పోయి, ఆకులు కాస్త మెత్తబడే వరకు సుమారు 2-3 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయండి. దీనిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఒక మిక్సీ జార్ తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేయాలి. దీనిని బరకగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అందులో వేయించిన కొత్తిమీర, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేయాలి. అవసరమైతే కొద్దిగా నీరు 2-3 స్పూన్లు పోసి మెత్తగా పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-చివరగా స్టవ్ పై చిన్న కడాయి పెట్టి 1 టీ స్పూన్ నూనె వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. చివరగా చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయండి. ఈ పోపును గ్రైండ్ చేసుకున్న చట్నీలో కలిపేయండి. అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే కొత్తిమీర చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, January 31, 2026, 7:24 [IST]
Desktop Bottom Promotion