పల్లీ, కొబ్బరి చట్నీలు పక్కన పెట్టండి.. నువ్వుల చట్నీ ట్రై చేయండి..రుచి అమోఘం,ఆరోగ్యం సురక్షితం

Posted By:

సాధారణంగా మన తెలుగు ఇళ్లలో ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, దోస, వడ వంటివి ఎక్కువగా చేసుకుంటాం. వీటిలోకి ఎప్పుడూ రొటీన్‌ గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీలే చేస్తుంటాం. రోజు అవే చట్నీలు తిని మీ కుటుంబ సభ్యులు బోర్ ఫీలవుతున్నారా? అయితే ఈసారి కాస్త కొత్తగా, మరింత రుచిగా ఉండే నువ్వుల చట్నీని ప్రయత్నించండి.

కేవలం రుచి కోసమే కాదండోయ్, నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు, మహిళలకు ఇది చాలా మంచిది. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, అలసట వంటి సమస్యల నుండి కూడా ఈ చట్నీ ఉపశమనం కలిగిస్తుంది. నువ్వుల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
తెల్ల నువ్వులు: అర కప్పు
నూనె: 1 టేబుల్ స్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
వేరుశనగ గుళ్ళు (పల్లీలు): 1 టేబుల్ స్పూన్
మిరియాలు: పావు టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
పసుపు: చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు: 5
చింతపండు: చిన్న నిమ్మకాయంత
కరివేపాకు: 2 రెమ్మలు
కొత్తిమీర: కొద్దిగా
పచ్చి కొబ్బరి తురుము: 3 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు: 3 లేదా 4
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం:
నూనె: 2 టీస్పూన్లు
ఆవాలు: అర టీస్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
కరివేపాకు: 1 రెమ్మ
ఎండు మిరపకాయ: 1

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో తెల్ల నువ్వులను వేసి నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడుతూ, మంచి సువాసన వచ్చే వరకు వేయించి వాటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి.

-అదే పాన్‌ లో ఒక చెంచా నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక మినపప్పు, వేరుశనగ గుళ్ళు, మిరియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. చివరగా చిటికెడు పసుపు వేసి కలపాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో వెల్లుల్లి రెబ్బలు, కడిగిన చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేసి పచ్చి వాసన పోయేలా కాసేపు వేయించాలి. చివరగా, ఇందులో పచ్చి కొబ్బరి తురుము, ఎండు మిరపకాయలను వేసి ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పాన్‌ లో వేయించిన మిగతా పదార్థాలన్నీ వేయాలి. దీనికి రుచికి సరిపడా ఉప్పు జత చేయాలి. మొదట నీళ్ళు పోయకుండా బరకగా తిప్పండి. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసి, మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా లేదా చట్నీలా రుబ్బుకోవాలి.చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండు మిరపకాయ ముక్కలు వేసి తాలింపు వేగనివ్వాలి. ఈ వేడి వేడి తాలింపును చట్నీలో కలిపేయండి.

-అంతే ఎంతో రుచికరమైన, పోషకాలతో కూడిన నువ్వుల చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, January 8, 2026, 7:47 [IST]
Desktop Bottom Promotion