వర్షాకాలానికి పర్ఫెక్ట్..ఈ కొబ్బరి నీళ్ల రసం రుచి చూస్తే మంత్రముగ్ధులైపోతారు..ఎలా చేసుకోవాలంటే

Posted By:

రసం రుచి చూడని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో వారానికి నాలుగు సార్లు అయినా ఇంట్లో రసం చేసేటోళ్లు చాలామందే ఉంటారు. జలుబు చేసినా, నీరసంగా ఉన్నా, లేదా వేడి వేడి అన్నంలోకి ఏదైనా కలుపుకుని తినాలనిపించినా..మనకు గుర్తొచ్చేది ఘుమఘుమలాడే రసం. టమోటా రసం, మిరియాల రసం, జీలకర్ర రసం వంటి ఎన్నో రకాలు మనం ప్రయత్నించి ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా లేత కొబ్బరి నీళ్లతో చేసిన రసం రుచి చూశారా?

కొబ్బరి నీళ్లతో రసమా అని ఆశ్చర్యపోకండి. ఇది కేవలం వింతైన ప్రయోగం కాదు, రుచిలో అమోఘం, ఆరోగ్యానికి అమృతం. లేత కొబ్బరి నీళ్లలోని సహజమైన తీపి, పోషకాలు మనం దంచుకున్న మసాలా దినుసుల ఘాటుతో కలిసినప్పుడు ఆ రుచే వేరు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈ రసం చేసుకుని తాగితే శరీరానికి వెచ్చదనం, బలం చేకూరుతాయి. ఈ సరికొత్త కొబ్బరి నీళ్ల రసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మసాలా ముద్ద కోసం:
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
సోంపు - అర టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 4
వెల్లుల్లి రెబ్బలు - 10
తాజా కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర కాడలతో సహా - కొద్దిగా
చింతపండు-చిన్న నిమ్మకాయంత
లేత కొబ్బరి నీళ్ళు- 1 లీటరు
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - ఒక రెమ్మ
టమోటా - 1
పసుపు - పావు టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా చింతపండును కొద్దిగా గోరువెచ్చని నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత రోట్లో లేదా మిక్సీలో జీలకర్ర, మిరియాలు, సోంపు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర కాడలు వేసి మెత్తటి ముద్దలా దంచుకుని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొబ్బరి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.

-ఇప్పుడు అందులో దంచి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేవరకు తక్కువ మంట మీద వేయించాలి.

-టమోటాను చేత్తో బాగా పిసికి గుజ్జులా చేసి, దానిని కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు మగ్గించాలి.

-ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

-నానబెట్టిన చింతపండు నుండి తీసిన రసం కూడా అందులో పోసి ఒక నిమిషం పాటు మరగనివ్వాలి.

-చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న లేత కొబ్బరి నీళ్ళను పోయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొబ్బరి నీళ్ళు పోశాక రసాన్ని ఎక్కువగా మరగించకూడదు.

-పైన నురుగు కట్టడం మొదలవగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే, ఆరోగ్యకరమైన లేత కొబ్బరి నీళ్ళ రసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 1, 2025, 11:50 [IST]
Desktop Bottom Promotion