రక్తం తక్కువగా ఉందా? వారానికి రెండుసార్లు ఈ చట్నీ తినాల్సిందే..ఇడ్లీ, దోశలోకి కేక

Posted By:

మన పెద్దలు ఆకుకూరలు ఆరోగ్యానికి అమృతం అని ఊరికే అనలేదు. ముఖ్యంగా మన ఇంటి పెరట్లో లేదా తక్కువ ధరకే మార్కెట్లో దొరికే మునగ ఆకు పోషకాల గని. సాధారణంగా మనం మునగ ఆకును పప్పులో వేసుకోవడమో, లేదా ఫ్రై చేసుకోవడమో చేస్తాం. కానీ ఎప్పుడూ ఒకే రకంగా తింటే ఎవరికైనా బోర్ కొడుతుందా? అయితే ఈసారి మునగ ఆకుతో ఎంతో రుచికరమైన, నోరూరించే మునగ ఆకు చట్నీని ట్రై చేయండి.

ఈ రోజుల్లో చాలామంది పిల్లల్లో, చివరకు పెద్దవారిలో కూడా రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఐరన్ టాబ్లెట్లు వాడటం కంటే సహజసిద్ధంగా దొరికే మునగ ఆకును ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా లేదా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ లోకి నంజుకు తిన్నా అద్భుతంగా ఉంటుంది. మునగాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మునగ ఆకు: 2 గుప్పెళ్ళు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
పల్లీలు: 1 టేబుల్ స్పూన్
శెనగపప్పు: 1 టేబుల్ స్పూన్
మినప్పప్పు: అర టీస్పూన్
జీలకర్ర: పావు టీస్పూన్
మిరియాలు: పావు టీస్పూన్
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
ఎండుమిర్చి: 2
చింతపండు: చిన్న ఉసిరికాయంత
పచ్చి కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం: ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి.

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కాగాక పల్లీలు, శెనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. పప్పులు రంగు మారుతున్నప్పుడు జీలకర్ర, మిరియాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు అదే పాన్ లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిన్న చింతపండు ముక్క వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

-ఇప్పుడు పాన్ లో శుభ్రం చేసి పెట్టుకున్న రెండు గుప్పెళ్ళ మునగ ఆకును వేయాలి. మునగ ఆకులో ఉండే వగరు పోవాలంటే అది బాగా వేగాలి. కాబట్టి కనీసం 7 నిమిషాల పాటు సన్నని మంటపై ఆకు పచ్చి వాసన పోయి, మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-వేయించి చల్లార్చిన పప్పులు, మునగ ఆకు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీనికి పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు జత చేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి, మరీ జారుగా కాకుండా చట్నీలా గట్టిగా రుబ్బుకోవాలి. చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-ఇప్పుడు చిన్న బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించి, ఈ తాలింపును చట్నీలో కలపండి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మునగ ఆకు చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, December 1, 2025, 7:11 [IST]
Desktop Bottom Promotion