పల్లీలు + నువ్వులు = అద్భుతమైన రుచి..బ్రేక్ ఫాస్ట్ లోకి బెస్ట్ కాంబినేషన్

Posted By:

ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లో ఇడ్లీ లేదా దోసె ఉండటం మన ఇళ్లలో సాధారణమే. వీటిల్లోకి నంజుకోడానికి ధారణంగా మనం కొబ్బరి చట్నీనో లేదా టమాటా చట్నీనో చేస్తుంటాం. కానీ రోజూ అదే రుచి అంటే ఇంట్లో వాళ్ళు బోర్ ఫీల్ అవ్వడం సహజం. కాబట్టి కొత్తగా వేరుశనగ నువ్వుల చట్నీ ట్రై చేయండి.

సాధారణ పల్లి చట్నీ కంటే భిన్నంగా నువ్వులు జోడించి చేసే ఈ చట్నీ రుచి అమోఘంగా ఉంటుంది. ఇది కేవలం 10 నిమిషాల్లో తయారైపోతుంది. రుచితో పాటు నువ్వుల్లో ఉండే కాల్షియం, పల్లీల్లో ఉండే ప్రోటీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సూపర్ టేస్టీ చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
తెల్ల నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
వేరుశనగ గుళ్ళు (పల్లీలు) - 3 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
సాంబార్ ఉల్లిపాయలు - 15
ఎండు మిరపకాయలు - 3
చింతపండు - చిన్న ఉసిరికాయంత
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
తాలింపుకి నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - 1 రెమ్మ

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి, మంటను సిమ్ లో పెట్టి దోరగా వేయించుకోండి. నువ్వులు చిటపటలాడి, మంచి వాసన రాగానే తీసి పక్కన ప్లేట్‌ లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌ లో పల్లీలను వేసి, అవి కూడా దోరగా వేగేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి.

-అదే పాన్‌ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు వేసి వేయించండి. చిన్న ఉల్లిపాయలు వాడటం వల్ల చట్నీకి కమ్మటి రుచి వస్తుంది.

-ఉల్లిపాయలు పారదర్శకంగా మారిన తర్వాత అందులో ఎండు మిరపకాయలు, చిన్న చింతపండు ముక్కను వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, వేయించిన ఉల్లిపాయ-మిర్చి మిశ్రమాన్ని అందులో వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి, నీరు పోయకుండా ఒకసారి బరకగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-చట్నీ రుచిని రెట్టింపు చేసేది తాలింపే. ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించండి. చివరగా కరివేపాకు వేసి, అది చిటపటలాడగానే స్టవ్ ఆపి, ఆ తాలింపును చట్నీలో కలపండి.

-అంతే ఎంతో రుచికరమైన, కమ్మని ఆంధ్రా స్పెషల్ వేరుశనగ నువ్వుల చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీ, దోసె, ఊతప్పం లేదా పునుగుల్లోకి ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, January 17, 2026, 11:35 [IST]
Desktop Bottom Promotion