రాగి ధలియా..బరువు తగ్గడానికి బెస్ట్..బీపీ,షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, మారుతున్న జీవనశైలి కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మళ్లీ మన ప్రాచీన ఆహార పద్ధతుల వైపు, ముఖ్యంగా మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి అత్యంత శక్తివంతమైన, పోషక విలువలు కలిగిన సిరిధాన్యాలలో రాగులు ముందు వరుసలో ఉంటాయి.

రాగులతో చేసే అద్భుతమైన, రుచికరమైన వంటకాల్లో రాగి ధలియా ఒకటి. రాగి ధలియాని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. బరువు తగ్గడానికి ఇది ఉత్తమంగా ఉంటుంది. షుగర్,బీపీ ఉన్నవాళ్లు కూడా దీనిని హాయిగా తినవచ్చు. టేస్టీ, హెల్దీ రాగి ధలియాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి
-పల్లీలు
-ముడి కందులు
--జీలకర్ర
-ధనియాలు
-కరివేపాకు
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-తోటకూర
-సామ బియ్యం
-నెయ్యి
-నిమ్మరసం

తయారీ విధానం

-ముందుగా 3 టేబుల్ స్పూన్ల సామ బియ్యం గిన్నెలో వేసి నీళ్లు పోసి కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలి.

-తర్వాత ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి(మొలకెత్తిన రాగి పిండి అయినా మంచిదే) వేయండి. ఇందులో జారుగా ఉండేలా నీళ్లు పోసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి తక్కువ మంట మీద వేయించి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే 3 టేబుల్ స్పూన్ల ముడి కందులు(Toor Dal)వేసి తక్కువ మంట మీద వేయించుకున్నాక అందులోనే 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాలు, 1 రెబ్బ కరివేపాకు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.

-తర్వాత మిక్సీ గిన్నెలో పల్లీలతో సహా వేయించినవన్నీ వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద మందపాటి గిన్నెలో 300 ml నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో చిటికెడు జీలకర్ర, నానబెట్టుకున్న సామ బియ్యం, 1 పచ్చిమిర్చి తరుగు, 1 కట్ట తోటకూర తరుగు వేసి మూతపెట్టి తక్కువ మంట మీద 4 నిమిషాలు ఉడికించుకోవాలి.

-తర్వాత మూత తీసి అందులో నానబెట్టుకున్న రాగి మిశ్రమం పోసి కలిపి ఉడికించుకోండి. మిశ్రమం కాస్త దగ్గరపడ్డాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశెనగ కందిపొడి మిశ్రమం వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.

-చివరగా అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అర చెక్క నిమ్మరసం వేసి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే రాగి ధలియా రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion