ఆహా ఏమి రుచి..రాయలసీమ కారం దోశ విత్ బొంబాయి చట్నీ..ఫిదా అవ్వాల్సిందే!

Posted By:

దక్షిణ భారతదేశంలో బ్రేక్ ఫాస్ట్ అనగానే ఫస్ట్ గుర్తుకువచ్చేది దోశ. అందులోనూ కడప కారం దోశ లేదా రాయలసీమ కారం దోశ అంటే నోరూరించే ఒక అద్భుతమైన వంటకం.

కరకరలాడే దోశ, దానిపై రాసిన ఎర్ర కారం, పైన చల్లిన పప్పుల పొడి, దానికి తోడుగా వేడి వేడి బొంబాయి చట్నీ.. ఈ కాంబినేషన్ తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు. రాయలసీమ స్పెషల్ కారం దోశ, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బొంబాయి చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Rayalaseema Karam Dosa and Bombay Chutney The Ultimate Breakfast Combo Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఎండుమిర్చి
-శెనగపిండి
-ఉప్పు
-వెల్లుల్లి
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-పుట్నాల పప్పు
-పసుపు
-కరివేపాకు
-ఉల్లిపాయ
-మెంతులు
-బియ్యం
-మినపప్పు
-అల్లం తరుగు
-కొత్తిమీర తరుగు
-నెయ్యి
-నూనె

Rayalaseema Karam Dosa and Bombay Chutney The Ultimate Breakfast Combo Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు మినపప్పుని 4 గంటల పాటు నానబెట్టాలి. అలాగే మరో గిన్నెలో 1 కప్పు దోశల బియ్యం 4 గంటల పాటు నానబెట్టాలి. మరో చిన్న గిన్నెలో 1 టీస్పూన్ మెంతులు 4 గంటల పాటు నానబెట్టాలి.

-తర్వాత మిక్సీలో నానిన మినపప్పు, మెంతులు,బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఎక్కువసేపు రుబ్బుకోవాలి. పిండి మృదువుగా ఉండాలి.

-రెడీ అయిన పిండిపై మూతపెట్టి 12 గంటల సేపు పక్కన పెట్టేయండి.

-కారం దోశల్లోకి కారం కోసం..25 ఎండు మిరపకాయలను ఒక గిన్నెలో వేసి వేడి నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి.

-మిరపకాయలు నానేలోగా పప్పుల పొడి చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ గిన్నెలో 7 వెల్లుల్లి రెబ్బలు, అరకప్పు పుట్నాల పప్పు(తినే శనగపప్పు)వేసి మెత్తని పొడిలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసి, ఇందులోనే రుచికి సరిపడా ఉప్ను, 1 టీస్పూన్ జీలకర్ర, 3 ఉల్లిపాయల పెద్ద ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం..నిమ్మకాయ సైజు అంత నానబెట్టుకున్న చింతపండు నుంచి పులసు తీయండి. ఇందులో 350ml నీరు,రెండున్నర టేబుల్ స్పూన్ల శెనగపిండి,రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి మొత్తం చేత్తో బాగా కలిసేలా కలుపుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టీస్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో అర టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ మినపప్పు వేసి ఎర్రగా వేపాక అందులోనే అర టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయల ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి.

-తాలింపు మొత్తం వేగాక అందులో 1 పచ్చిమిరపకాయ సన్నని తరుగు, అర టీస్పూన్ అల్లం తరుగు, 2 చిటికెళ్ల పసుపు వేసి వేపండి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న శనగపిండి చింతపండు నీళ్ల మిశ్రమిన్ని పాన్ లో పోసి కలుపుతూ మరిగించాలి.

-2 నిమిషాలకు చట్నీ చిక్కబడుతుంది. ఉడుకు వచ్చిరాగానే స్టవ్ ఆపేయండి. ఇప్పుడు పాన్ లోనే కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని దించేసుకోండి. బొంబాయి చట్నీ జారుగానే ఉండాలని గుర్తుపెట్టుకోండి

-ఇప్పుడు 12 గంటల పాటు పక్కన ఉంచుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద దోశ పెసం పెట్టి వేడయ్యాక కాస్త మందంగా పిండితో దోశను పోసుకోండి. దోశ అంచుల వెంట కొంచెం నూనె పోసి కాలనివ్వండి.

-దోశ మధ్యలో ఎర్రగా మారడం మొదలైనప్పుడు దోశ మీద 1 టీస్పూన్ నెయ్యి వేసి దాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత దానిమీద రెడీ చేసుకున్న ఎర్ర కారం పేస్ట్ వేసి దోశ మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత దోశ మీద 1 టీస్పూన్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి చల్లి కొన్ని సెకన్లు ఉంచి ప్లేట్ లోకి తీసుకోండి.

-అంతే కారం దోశ రెడీ. దీనిని ముందుగా రెడీ చేసుకున్న బొంబాయి చట్నీతో తింటే అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, February 12, 2026, 14:38 [IST]
Desktop Bottom Promotion