సంక్రాంతి స్పెషల్..నోట్లో వెన్నలా కరిగిపోయే నేతి అరిసెలు..ఇలా చేసుకోండి

Posted By:

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలుగువారికి సంక్రాంతి అంటే మొదట గుర్తుకొచ్చేది తియ్యటి అరిసెలు. కొత్త అల్లుళ్ళు, కోడి పందేలు, రంగురంగుల ముగ్గులు, గాలిపటాలతో పాటు ఘుమఘుమలాడే అరిసెలు లేనిదే సంక్రాంతి పండుగ పూర్తి కాదు. అరిసె అంటేనే ఆరోగ్యమని, ఆనందమని పెద్దల మాట.

ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే ఈ పండుగలో బెల్లం, నువ్వులు, నెయ్యి కలిపి చేసే అరిసెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అరిసెలు చేయడం ఒక కళ. ఈ సంక్రాంతికి నోరూరించే సంప్రదాయ నేతి అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పాత రేషన్ బియ్యం లేదా దొడ్డు బియ్యం: 1 కేజీ
బెల్లం: 750 గ్రాములు
తెల్ల నువ్వులు: 50-100 గ్రాములు
నెయ్యి: డీప్ ఫ్రైకి సరిపడా
యాలకుల పొడి: 1 స్పూన్
కొబ్బరి తురుము: ఎండిన కొబ్బరి చిన్న ముక్కలు

తయారీ విధానం

-బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు ఒక రోజు మొత్తం నానబెట్టాలి. మధ్యలో ఒకటి రెండు సార్లు నీళ్లు మారుస్తూ ఉండాలి.

-24 గంటల తర్వాత నీటిని వడకట్టి, బియ్యాన్ని ఒక పొడి కాటన్ వస్త్రంపై ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఆరిపోకూడదు, చేతికి తడి తగులుతున్నప్పుడే మిల్లులో లేదా మిక్సీలో మెత్తని పిండిలా పట్టించుకోవాలి. ఈ పిండిని జల్లించి, తడి ఆరిపోకుండా గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత ఒక మందపాటి గిన్నెలో తురిమిన బెల్లం వేసి, అందులో చిన్న టీ గ్లాసుడు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకుంటే చెత్త పోతుంది. ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి పాకం రానివ్వాలి.

-ఒక గిన్నెలో నీళ్లు పోసి, ఉడుకుతున్న బెల్లం పాకాన్ని కొద్దిగా అందులో వేయాలి. ఆ పాకాన్ని వేళ్ళతో తీస్తే అది మెత్తటి ఉండలా రావాలి. చేతితో నొక్కితే జారకుండా ఉండలా నిలబడాలి. దీన్నే ఉండ పాకం అంటారు. ముదురు పాకం వస్తే అరిసెలు గట్టిగా అయిపోతాయి, లేత పాకం అయితే నూనె పీల్చేస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి.

-పాకం రాగానే మంట సిమ్ లో పెట్టి లేదా దించేసి అందులో యాలకుల పొడి, నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ జారుగా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా పైన కొద్దిగా నెయ్యి రాసి మూత పెట్టాలి.

-స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి పోసి వేడి చేయాలి. నెయ్యి కాగిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని, నిమ్మకాయ సైజులో పిండిని తీసుకుని ప్లాస్టిక్ కవర్ లేదా అరటి ఆకు మీద గుండ్రంగా, మరీ పల్చగా కాకుండా మధ్యస్తంగా ఒత్తుకోవాలి.

-ఒత్తుకున్న అరిసెను కాగుతున్న నెయ్యిలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచాలి. అరిసె పొంగి పైకి రాగానే రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి.

-బాండీలో నుండి తీసిన వెంటనే అరిసెను రెండు గరిటెల మధ్య పెట్టి గట్టిగా ఒత్తాలి. దీనివల్ల అదనంగా ఉన్న నెయ్యి పోతుంది. అంతే నేతి అరిసెలు రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion