నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ఆలూ-అటుకుల పరాఠా..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

Posted By:

ప్రతి రోజూ రాత్రి పూట డిన్నర్లో ఏం వండాలి? అనే ప్రశ్న దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఎక్కువగా చపాతీ లేదా పుల్కా చేసుకోవడం మనందరికీ అలవాటే. కానీ రోజూ ఒకే రకమైన ప్లెయిన్ చపాతీలు తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఆలూ అటుకుల పరోఠా ఎప్పుడైనా ప్రయత్నించారా?

ఆలూ అటుకుల పరోఠా సాధారణ ఆలూ పరాఠా కంటే చాలా భిన్నంగా, ఎంతో మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఈ ఆలూ అటుకుల పరాఠా చేయడం చాలా సులభం. దీనికి ప్రత్యేకంగా కూర కూడా అవసరం లేదు, కానీ కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచి వేరే లెవల్ లో ఉంటుంది. ఆలూ అటుకుల పరాఠా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Soft Tasty and Unique How to Make Aloo Poha Paratha in Simple Steps

కావలసిన పదార్థాలు
పెద్ద బంగాళాదుంప: 1
అటుకులు: 1 కప్పు
గోధుమ పిండి: అర కప్పు
జీలకర్ర: అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్: 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2 టీస్పూన్
నూనె: 1 టేబుల్ స్పూన్
నీళ్లు: 1 కప్పు
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద బంగాళాదుంపను తీసుకుని, దాని చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత దానిని సన్నగా తురుముకోవాలి. ఇలా తురిమిన బంగాళాదుంప నల్లబడకుండా ఉండాలంటే వెంటనే నీళ్లలో వేసి ఉంచండి.

-ఒక కప్పు అటుకులను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోండి.

-స్టవ్ వెలిగించి ఒక పాన్ లేదా కడాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు దోరగా వేయించండి. ఆ సువాసన వస్తున్నప్పుడే అందులో ఒక కప్పు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి నీటిని మరిగించాలి.

-నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళాదుంప తురుమును నీటిలో వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి.

-బంగాళాదుంప ఉడికిన తర్వాత మంటను తగ్గించి, మనం పొడి చేసి పెట్టుకున్న అటుకుల పొడిని అందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడి దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత స్టవ్ ఆపివేసి, ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి.

-మిశ్రమం చల్లారిన తర్వాత అందులో అర కప్పు గోధుమ పిండిని వేసి బాగా కలపాలి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, బంగాళాదుంప మిశ్రమంలోని తడి సరిపోతుంది. దీనిని మెత్తటి చపాతీ పిండిలా కలుపుకోవాలి.

-తయారు చేసుకున్న పిండిలో నుండి చిన్న ముద్దను తీసుకుని, పొడి పిండి అద్దుకుంటూ చపాతీ కర్రతో గుండ్రంగా, మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఒత్తుకోవాలి.

-స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక ఒత్తుకున్న పరాఠాను వేయండి. రెండు వైపులా నూనె రాస్తూ, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి ఆలూ అటుకుల పరాఠా రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, December 19, 2025, 10:53 [IST]
Desktop Bottom Promotion