ముక్క జ్యూసీగా,గ్రేవీ చిక్కగా..కేరళ స్టైల్ మటన్ కర్రీ

Posted By:

నాన్ వెజ్ ప్రియులకు కేరళ స్టైల్ మటన్ కర్రీ ఒక అద్భుతమైన విందు. సాధారణ మటన్ కర్రీకి, కేరళ స్టైల్ కర్రీకి చాలా తేడా ఉంటుంది.

కేరళ స్టైల్ లో మనం మసాలా దినుసులను, కొబ్బరిని వేయించి, ఆపై పేస్ట్‌ లా చేసి కూరలో వాడతాము. దీనివల్ల కూర చిక్కగా రావడమే కాకుండా, అద్భుతమైన రుచిని, సువాసనను ఇస్తుంది. కేరళ స్టైల్ మటన్ కర్రీ మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spicy and Juicy Authentic Kerala Style Mutton Curry Recipe in Telugu

కావలసిన పదార్థాలు
మటన్ (మేక మాంసం): అర కిలో
పసుపు: అర టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
నిమ్మరసం లేదా పెరుగు: 1 టీస్పూన్
తురిమిన పచ్చి కొబ్బరి: 1 కప్పు
సాంబార్ ఉల్లిపాయల: 5-6
కరివేపాకు: 2 రెమ్మలు
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
సోంపు : 1 టీస్పూన్
మిరియాలు: 1 టీస్పూన్
దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క
లవంగాలు: 4
యాలకులు: 3
ఎండుమిర్చి: 4-5
కొబ్బరి నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు: అర టీస్పూన్
ఉల్లిపాయలు: 2 పెద్దవి
పచ్చిమిర్చి: 3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
టమోటాలు: 2
కరివేపాకు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా మటన్‌ను శుభ్రంగా కడగాలి. నీరంతా పోయిన తర్వాత ఒక గిన్నెలో మటన్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి కలిపి కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో తురిమిన కొబ్బరి, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి నూనె వేయకుండానే వేయించాలి. కొబ్బరి లేత గోధుమ రంగులోకి వచ్చాక అందులో ధనియాలు, సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేయాలి.

-మంటను సిమ్‌ లో ఉంచి కొబ్బరి ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. స్టవ్ ఆపి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-తర్వాత ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి అందులో కొబ్బరి నూనె వేడి చేశాక ఆవాలు,కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి, అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

-ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను కుక్కర్ లో వేసి పెద్ద మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి.

-ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి మసాలా పేస్ట్‌ను కుక్కర్లో వేసి బాగా కలపాలి. అవసరమైనన్ని నీళ్లు (సుమారు 1.5 నుండి 2 కప్పులు) పోసి రుచికి సరిపడా ఉప్పు చూసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి, మటన్ లేతగా ఉంటే 4-5 విజిల్స్, ముదురుగా ఉంటే 6-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కూర మరీ పల్చగా ఉంటే, మరికొద్దిసేపు సిమ్‌ లో ఉడికించి నూనె పైకి తేలే వరకు ఉంచాలి. అంతే కేరళ మటన్ కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, January 7, 2026, 19:07 [IST]
Desktop Bottom Promotion