నోట్లో వేస్తే కరిగిపోయే జీడిపప్పు మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన సాంప్రదాయ స్వీట్లలో మైసూర్ పాక్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ తీపి వంటకం అంటే ఇష్టపడని వారు బహుశా ఉండరు. అయితే సాధారణ మైసూర్ పాక్‌ కు కాస్త భిన్నంగా, మరింత రుచిగా ఉండేలా జీడిపప్పు మైసూర్ పాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? కమ్మటి నెయ్యి వాసన, వేయించిన జీడిపప్పుల కరకరలు కలిసి ఈ స్వీట్‌ కు ఒక రాజసాన్ని తీసుకొస్తాయి. ఇంట్లోనే ఈజీగా, పర్ఫెక్ట్ గా జీడిపప్పు మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Sweet Shop Style Cashew Mysore Pak Recipe in Telugu Perfect Soft and Flavourful

జీడిపప్పు మైసూర్ పాక్ తయారీకి కావలసిన పదార్థాలు

శనగపిండి (బేసన్) - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
నీళ్లు - 1 కప్పు
నెయ్యి - ఒకటిన్నర కప్పులు
జీడిపప్పు - అర కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్

జీడిపప్పు మైసూర్ పాక్ తయారీ విధానం

-ముందుగా జీడిపప్పును దోరగా వేయించి,మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న ఒక గిన్నెను పెట్టుకోండి. అందులో చక్కెర, నీళ్లు పోసి మీడియం మంట మీద మరగనివ్వండి. చక్కెర పూర్తిగా కరిగి, పాకం కొద్దిగా చిక్కబడే వరకు మరిగించాలి. ఇది స్వీట్‌ కు సరైన ఆకృతిని ఇస్తుంది.

-ఇప్పుడు మరో పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకుని, అందులో కొద్దిగా నెయ్యి వేయండి. మంటను పూర్తిగా సిమ్‌ లో ఉంచి శనగపిండిని వేసి నెమ్మదిగా వేయించండి. శనగపిండిలోని పచ్చి వాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించాలి. పిండి రంగు మారకూడదు, మాడకూడదు.

-వేయించి పెట్టుకున్న శనగపిండిలో ముందుగా సిద్ధం చేసుకున్న వేడి చక్కెర పాకాన్ని నెమ్మదిగా పోయాలి. పోస్తున్నంత సేపు ఒక చేత్తో గరిటెతో ఎక్కడా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా (ఒక్కో గరిటె) అందులో వేస్తూ నిరంతరం కలుపుతూ ఉండాలి. నెయ్యి పిండిలో కలిసిపోయి, ఉడుకుతున్నప్పుడు వచ్చే గుమగుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి.

-కొద్దిసేపటికి మిశ్రమం బాగా చిక్కబడి, పాత్ర అంచులను వదులుతూ, గుల్లగా మారుతుంది. సరిగ్గా ఈ దశలోనే ముందుగా దోరగా వేయించి బరకగా పొడి చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమం, యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలపాలి.

-స్వీట్ చేయడానికి ముందే కొద్దిగా నెయ్యి రాసి ఒక పళ్ళెన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వేడి వేడి మిశ్రమాన్ని ఆ పళ్ళెంలో పోసి పైభాగం సమానంగా వచ్చేలా గరిటెతో సున్నితంగా పరచండి. అది సరిగ్గా అతుక్కోవడానికి తేలికగా నొక్కండి.

-కొద్దిగా చల్లారిన తర్వాత, పూర్తిగా గట్టిపడకముందే చాకుతో మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మటి, రుచికరమైన జీడిపప్పు మైసూర్ పాక్ తినడానికి రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, May 24, 2026, 9:08 [IST]
Desktop Bottom Promotion