చపాతీ, పూరీ, రైస్..దేనిలోకైనా అదిరిపోయే మష్రూమ్ మటర్ మసాలా..మటన్ కూరను మించిన రుచి!

Posted By:

మీరు తరచుగా ఇంటికి పుట్టగొడుగులను తెస్తుంటారా? తెచ్చిన ప్రతిసారీ ఒకే రకమైన కూర చేసి బోర్ కొడుతోందా? పుట్టగొడుగులతో కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి, కానీ రుచి మాత్రం నాన్‌ వెజ్ కర్రీలా అదిరిపోవాలి అని అనుకుంటున్నారా? అయితే మష్రూమ్ మటర్ మసాలా ట్రై చేయాల్సిందే.

దీనిని మష్రూమ్ మటన్ మసాలా అని పిలుచుకోవచ్చు. బఠానీలు, పుట్టగొడుగుల కలయిక వల్ల ఇది రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. చపాతీ, పూరీ, దోసె లేదా వేడివేడి అన్నంలోకి ఈ కూర అమృతంలా అనిపిస్తుంది. ఇంట్లోనే సులభంగా మష్రూమ్ మటర్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Tastes Like Mutton How to Make Rich and Creamy Mushroom Matar Masala Recipe in Telugu

కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు - 1 కప్పు
పచ్చి బఠానీలు - అర కప్పు
పెద్ద టమోటాలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఫ్రెష్ క్రీమ్-పావు కప్పు
పాలు -అర కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - 3 టేబుల్ స్పూన్లు
కసూరి మేథి - 1 టేబుల్ స్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
యాలకులు - 1
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
జీలకర్ర - 1 టీస్పూన్

తయారీ విధానం

-ముందుగా టమోటాలను ముక్కలుగా కోసి పచ్చిమిర్చితో కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్‌ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోండి.

-స్టవ్ వెలిగించి ఒక బాండీలో నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక యాలకులు, దాల్చిన చెక్క వేసి, ఆ తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడాక, ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా-పచ్చిమిర్చి పేస్ట్‌ ను అందులో వేసి వేయించాలి.

-టమోటా పేస్ట్ కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు సుమారు 5 నిమిషాలు మూత పెట్టి సన్నని మంటపై వేయించాలి. పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కసూరి మేథి వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు మసాలా మిశ్రమంలో పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీరు పోసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. బఠానీలు ముప్పావు వంతు ఉడికిన తర్వాత, కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను వేయాలి. అవసరమైతే మరో అర కప్పు నీరు పోసి మూత పెట్టి మీడియం మంటపై 4-5 నిమిషాల పాటు ఉడికించాలి.

-పుట్టగొడుగులు మెత్తగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు మంటను తగ్గించి ఫ్రెష్ క్రీమ్ వేసి నిదానంగా కలపాలి. తర్వాత పాలు పోసి, గ్రేవీ చిక్కబడే వరకు సన్నని మంటపై ఉడికించాలి.

-గ్రేవీ నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే మష్రూమ్ మటర్ మసాలా రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, January 20, 2026, 21:10 [IST]
Desktop Bottom Promotion