ఎగ్ బటర్ మసాలా..తిన్నారంటే మస్త్ మజా,ఎలా చేయాలంటే..

Posted By:

కోడిగుడ్లతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. దేని టేస్ట్ దానిదే. అయితే మీరెప్పుడైనా ఎగ్ బటర్ మసాలా తిన్నారా? కోడిగుడ్లతో తయారుచేసే ఈ వంటకం భారతీయ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. దీని రుచి, నోరూరించే సువాసన ఎవరినైనాసరే ఇట్టే ఆకర్షిస్తుంది. చపాతీ, నాన్, రోటీ లేదా అన్నంతో కలిపి తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కేవలం రుచి మాత్రమే కాదు..ఎగ్ బటర్ మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. దీనిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఎగ్ బటర్ మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఎగ్ బటర్ మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

-గుడ్లు: 4
-కొత్తిమీర: కొద్దిగా
-కసూరి మెంతి: 1 టీ స్పూన్
-కారం: 1 టీ స్పూన్
-ధనియాల పొడి: 1 టీ స్పూన్
-జీలకర్ర పొడి: 1/2 టీ స్పూన్
-గరం మసాలా: 1/2 టీ స్పూన్
-పసుపు: 1/4 టీ స్పూన్
-ఉల్లిపాయలు: 2
-టమాటాలు: 3
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-ఫ్రెష్ క్రీమ్ (మీగడ): 2 టేబుల్ స్పూన్లు
-జీడిపప్పు: 10-12
-పచ్చిమిర్చి: 2
-నూనె లేదా నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
-బటర్: 2 టేబుల్ స్పూన్లు
-చక్కెర: 1/2 టీ స్పూన్
-ఉప్పు: తగినంత

ఎగ్ బటర్ మసాలా తయారీ విధానం

-ముందుగా గుడ్లను బాగా ఉడికించి పొట్టు తీసి ఒక్కో గుడ్డును రెండు సమాన భాగాలుగా కోయాలి. మీరు కావాలంటే గుడ్డు సొనను తీసి పక్కన పెట్టుకోవచ్చు (దీనిని గ్రేవీలో వేసుకోవచ్చు).

-తర్వాత వేడినీళ్లలో నానబెట్టిన జీడిపప్పును మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

-ఉల్లిపాయలు వేగిన తర్వాత..తరిగిన టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి,లేదంటే అడుగంటుతుంది.

-టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు,పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. మసాలాలు నూనెలో కాసేపు వేగితే మంచి సువాసన వస్తుంది.

-ఇప్పుడు తయారు చేసుకున్న జీడిపప్పు పేస్ట్‌ ను అందులో వేసి బాగా కలపాలి. ఇది గ్రేవీకి మంచి చిక్కదనాన్ని ఇస్తుంది. ఒక నిమిషం పాటు ఉడికించాలి.

-ఇప్పుడు అవసరమైన మేరకు నీరు పోసి, గ్రేవీని మీకు కావలసిన చిక్కదనానికి తీసుకురావాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి.

-గ్రేవీ మరిగిన తర్వాత బటర్ లేదా వెన్న, గరం మసాలా వేసి బాగా కలపాలి. వెన్న కరిగే వరకు ఉడికించాలి.

-తర్వాత నలిపిన కసూరి మెంతి, కావాలనుకుంటే కొద్దిగా చక్కెర వేసి కలపాలి. చక్కెర వేయడం అనేది ఆప్షనల్.. కానీ ఇది రుచిని బ్యాలెన్స్ చేస్తుంది.

-ఇప్పుడు సగానికి కోసిన ఉడికించిన గుడ్లను గ్రేవీలో వేసి నెమ్మదిగా కలపాలి. గుడ్లు మసాలాను బాగా పీల్చుకునేలా కొన్ని నిమిషాలు ఉడికించాలి.

-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎగ్ బటర్ మసాలా రెడీ. వేడి వేడిగా చపాతీ, నాన్ లేదా అన్నంతో తింటే అదిరిపోతుంది. మీరు కావాలంటే సర్వ్ చేసే ముందు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Wednesday, March 26, 2025, 10:34 [IST]
Desktop Bottom Promotion