సీఎం రేవంత్ ఫేవరెట్..చికెన్,మటన్ కూడా దీని ముందు పనికిరాదు..జొన్న రొట్టెతో తింటే ఆ మజానే వేరు

Posted By:

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ మీటింగ్ మాట్లాడుతూ దోసకాయ కందిపప్పు గురించి ప్రస్తావన తెచ్చారు. తనకు దోసకాయ కందిపప్పు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. గతంలో నానమ్మలు,అమ్మమ్మలు దోసకాయ కందిపప్పు చేస్తే దాని రుచి ముందు చికెన్, మటన్ కూడా పనికొచ్చేది కాదని అన్నారు. జొన్న రొట్టెతో తింటే ఆ మజానే వేరే ఉంటదన్నారు. దోసకాయ కందిపప్పు అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఆరోగ్యకరమైన, సాంప్రదాయ వంటకం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలిపి తిన్నా అద్భుతమైన రుచిని ఇస్తుంది. దోసకాయ కందిపప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
కందిపప్పు-1 కప్పు (200 గ్రాములు)
దోసకాయ (పండినది, లేతది)-1
ఉల్లిపాయ-1
పచ్చిమిర్చి-3-4
టమాటో- 1
పసుపు- అర టీస్పూన్
చింతపండు గుజ్జు- 1 టీస్పూన్
ఉప్పు-రుచికి తగినంత
నీళ్లు -3-4 కప్పులు
నూనె-2 టేబుల్ స్పూన్లు
ఆవాలు-1 టీస్పూన్
జీలకర్ర-1 టీస్పూన్
ఎండుమిర్చి-2-3
ఇంగువ-చిటికెడు
కరివేపాకు-1 రెబ్బ
వెల్లుల్లి రెబ్బలు-4-5
కొత్తిమీర- కొద్దిగా

Telangana CM Revanth Reddy s Favorite Dosakaya Kandi Pappu Recipe in Telugu

తయారీ విధానం

-కందిపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగి 15-20 నిమిషాలు నానబెట్టాలి.

-దోసకాయను చెక్కు తీసి లోపల ఉన్న గింజలు, గుజ్జును పూర్తిగా తొలగించాలి.

-దోసకాయను చిన్న చిన్న సమంగా అర అంగుళం ముక్కలుగా కోయాలి.

-ఒక ప్రెజర్ కుక్కర్‌ లో కడిగిన కందిపప్పును వేయాలి. ఇందులో కోసిన దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి, పసుపు, 3 కప్పుల నీటిని కలపాలి.

-కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు లేదా పప్పు పూర్తిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి.

-కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలి. ఉడికించిన పప్పును గరిటెతో కానీ, పప్పు గుత్తితో కానీ మెత్తగా చిదమాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా దోసకాయ ముక్కలు కనిపిస్తే రుచి బాగుంటుంది.

-ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి.

-ఒకవేళ పప్పు చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు కలిపి మరికొద్ది సేపు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని 5-7 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.

-తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడించాలి. తర్వాత జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి, వెల్లుల్లి గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి.

-చివరగా కరివేపాకు వేసి అవి క్రిస్పీగా మారిన తర్వాత వెంటనే ఈ తాలింపును ఉడికించిన దోసకాయ కందిపప్పులో వేసి కలపాలి.

-పప్పును గిన్నెలోకి తీసుకుని పైన తరిగిన కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి అన్నంతో పాటు వడ్డించాలి.

[ of 5 - Users]
Story first published: Monday, September 29, 2025, 16:08 [IST]
Desktop Bottom Promotion