ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!

మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే విటమిన్ D చాలా కీలకం. ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి ఉదయం పూట లేత సూర్యరశ్మిలో నిలబడటం ఉత్తమమైన మార్గం.

అయితే చాలామంది ఉదయం ఎండలో ఆరుబయట గడుపుతున్నప్పటికీ విటమిన్ D ట్యాబ్లెట్లు వాడుతున్నప్పటికీ.. వారి రక్త పరీక్షల్లో విటమిన్-డి స్థాయిలు తక్కువగానే ఉంటుంటాయి. ఇలా మీకూ జరుగుతోందా? అయితే మీరు తినే ఆహారాన్ని, తీసుకునే విటమిన్లను మీ శరీరం సరిగ్గా గ్రహించలేకపోతోందని అర్థం.

Sun Exposure Isn t Enough Nutritionist Neha Ranglani Reveals Why Vitamin D Pills Fail

ప్రముఖ పోషకాహార నిపుణురాలు నేహా రంగ్లానీ ఈ సమస్యపై తన ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్ లో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. శరీరానికి అవసరమైన విటమిన్-D అందాలంటే కేవలం ఎండలో ఉంటే సరిపోదని, మన శరీరంలో పిత్త ప్రవాహం ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆమె వివరించారు. మనం తీసుకునే విటమిన్లు, పోషకాలను శరీరం వంటపట్టించుకోవాలంటే మన జీవక్రియలు చురుగ్గా ఉండాలి. సకల జాగ్రత్తలు తీసుకుంటున్నా విటమిన్-D ఎందుకు పెరగదో ఇక్కడ చూడండి.

పిత్త ప్రవాహం మందగించడం

విటమిన్-D అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది శరీరంలో కరిగిపోవాలంటే పిత్తం అత్యవసరం. మన కాలేయం ఈ పిత్తాన్ని ఉత్పత్తి చేసి పిత్తాశయంలో నిల్వ చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని కొవ్వును విచ్ఛిన్నం చేసి.. విటమిన్ A, D, E,K లాంటి కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం గ్రహించేలా చేయడం ఈ పిత్తం ముఖ్య విధి. కాబట్టి పిత్త ప్రవాహం సరిగ్గా లేనప్పుడు, మీరు ఎంత ఎండలో తిరిగినా ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా విటమిన్-D ఒంటపట్టదు.

పిత్త ప్రవాహం మెరుగుపడాలంటే ఏం చేయాలి?

-మీ రోజువారీ ఆహారంలో కాకరకాయ, మెంతులు, ముల్లంగి లాంటి కొద్దిగా చేదుగా ఉండే కూరగాయలను చేర్చుకోండి.

-ఆలివ్ నూనె, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తినండి.

-కొవ్వులు పూర్తిగా మానేసే డైట్లను గుడ్డిగా అనుసరించవద్దు. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవండి. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి పొట్టు తీయని తృణధాన్యాలను ఆహారంగా తీసుకోండి.

దీర్ఘకాలిక ఒత్తిడి
మన శరీరం విటమిన్-డి, అలాగే కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) వంటి ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్‌ ను ఉపయోగిస్తుంది. అయితే మీరు విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం మిమ్మల్ని కాపాడేందుకు ముందుగా కార్టిసాల్ ను అధికంగా ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.

దీనివల్ల విటమిన్-D తయారీకి ఆటంకం ఏర్పడి, దాని లెవల్స్ పడిపోతాయి. అంతేకాకుండా ఒత్తిడి వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. అప్పుడు ఆ మంటను తగ్గించడానికి శరీరానికి మరింత విటమిన్-డి అవసరమవుతుంది. ఫలితంగా ట్యాబ్లెట్లు తీసుకున్నా లోపం అలాగే ఉండిపోతుంది.

ఒత్తిడిని జయించడం ఎలా?

-మానసిక ఒత్తిడి తగ్గాలంటే రాత్రిపూట ప్రశాంతమైన, తగినంత నిద్ర చాలా ముఖ్యం.

-ఉదయం పూట కాసేపు సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడపండి.

-క్రమం తప్పకుండా ప్రాణాయామం, ధ్యానం చేయండి.

-రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాన్ని తీసుకోండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, March 9, 2026, 20:05 [IST]
Desktop Bottom Promotion