ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!

Posted By:

వేసవికాలం వచ్చేసింది.. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి వాతావరణంలో మన శరీరం సహజంగానే చలవ చేసే ఆహారాలను కోరుకుంటుంది. సాధారణంగా మధ్యాహ్నం పూట వేడి వేడి అన్నంలోకి రసం, పచ్చిపులుసు, సాంబార్ వంటివి తింటే చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే వీటన్నింటి కంటే పొట్టకు ఎంతో ప్రశాంతతను ఇచ్చేది మాత్రం పెరుగుతో చేసే వంటకాలే.

అయితే ఎప్పుడూ ఒకే రకమైన మజ్జిగ పులుసు కాకుండా, ఈసారి కాస్త భిన్నంగా తెలంగాణ స్టైల్‌ లో అదిరిపోయే సల్ల చారు(చల్ల చారు) ట్రై చేసి చూడండి..మళ్లీ మళ్లీ కావాలంటారు.

Telangana Style Salla Charu Recipe in Telugu The Ultimate Summer Comfort Food You Must Try

సల్ల చారు తయారీకి కావాల్సిన పదార్థాలు

పెరుగు - 1 లీటర్

సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 7
అల్లం - 2 అంగుళాల ముక్క
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర తరుగు - ఒక గుప్పెడు
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - అవసరమైనన్ని.
తాలింపుకి నూనె - 4 టేబుల్ స్పూన్లు
మెంతులు - అర టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
దంచిన వెల్లుల్లి రెబ్బలు - 8
ఎండుమిర్చి - 6
కరివేపాకు - కొద్దిగా

సల్ల చారు తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో లీటర్ పెరుగు వేయాలి.కమ్మటి పెరుగు కంటే, కాస్త పుల్లగా ఉన్న పెరుగు వాడితే సల్ల చారు రుచి రెట్టింపు అవుతుంది. పెరుగులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి, కవ్వం లేదా విస్కర్ సహాయంతో గడ్డలు లేకుండా పెరుగును వెన్నలా మృదువుగా అయ్యేదాకా చిలకాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మరీ మెత్తగా కాకుండా.. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఘాటైన పేస్ట్‌ ను ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చటి కొత్తిమీర తరుగు, చిటికెడు పసుపు వేసి మిక్స్ చేయాలి. సల్ల చారు మరీ చిక్కగా కాకుండా ఉండటానికి మీకు కావలసినంత నీళ్లు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

-సల్ల చారుకు ప్రాణం తాలింపే. ఇందుకోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. చివరగా ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

-వేడి వేడి తాలింపుని నేరుగా తీసుకెళ్లి పెరుగు మిశ్రమంలో వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే గుమగుమలాడే సల్ల చారు రెడీ.

-ఈ సల్ల చారును తయారు చేసిన వెంటనే తినడం కంటే, ఒకట్రెండు గంటల పాటు అలా పక్కన వదిలేస్తే.. పోపులోని ఫ్లేవర్స్ అన్నీ పెరుగుకు పట్టి రుచి అద్భుతంగా మారుతుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, March 7, 2026, 17:17 [IST]
Desktop Bottom Promotion